Raghurama Krishnaraju : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కానుమూరు రఘురామ కృష్ణరాజుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయన ఎంపీగా ఉన్న సమయంలో హైదరాబాద్లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ను అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది. గతంలో ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ బాషాపై దాడి చేశారనే ఆరోపణలతో రఘురామ, ఆయన కుమారుడు భరత్, కార్యాలయ సిబ్బందిపై ఈ కేసు నమోదైంది.
ALSO READ: Nara Lokesh : పండక్కి ముందే గుడ్ న్యూస్ చెప్పిన నారా లోకేష్
అయితే, ఈ కేసును కొనసాగించే ఉద్దేశం లేదని కానిస్టేబుల్ బాషా తాజాగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ జేకే మహేశ్వరి ధర్మాసనం, రఘురామతో పాటు ఆయన కుమారుడు, సిబ్బందిపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.
రఘురామ కృష్ణరాజు గతంలో నరసాపురం ఎంపీగా వైఎస్సార్సీపీ నుంచి గెలిచినప్పటికీ, పార్టీ విధానాలను విమర్శిస్తూ తిరుగుబాటు చేశారు. అప్పటి సీఎం జగన్ తో పాటు వైసీపీపై రఘరామ తీవ్ర విమర్శలు గుప్పించారు. 2021లో సెడిషన్ ఆరోపణలతో ఆయన్ను ఏపీ సీఐడీ అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలోనే ఆయనపై తీవ్రంగా దాడి జరిగినట్లు ఆరోపణలు సైతం ఉన్నాయి. అప్పట్లో ఈ కేసు సంచలనం సృష్టించింది. అయితే సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ALSO READ: AP TDR Bonds Scam : ఏపీలో రూ.700 కోట్ల టీడీఆర్ బాండ్స్ స్కాం జరిగింది – మంత్రి నారాయణ
ఇక ఈ పరిణామాల అనంతరం ఆయన వైఎస్సార్సీపీని వీడి, టీడీపీలో చేరి ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 నవంబర్లో ఆయన ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ తాజా తీర్పుతో రఘురామకు గత కేసుల నుంచి మరో ఊరట లభించింది. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.


