థియేటర్ల బంద్ వ్యవహారం నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ, ఏపీ ప్రభుత్వం మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విశాఖలో పలువురు సినీ ప్రముఖులు(Tollywood) భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దొండపర్తిలో నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు సమావేశమయ్యారు. ఈ భేటీలో నిర్మాతలు స్రవంతి రవికిశోర్, సి.కల్యాణ్, సుధాకర్రెడ్డి, భరత్ భూషణ్, తదితరులు పాల్గొన్నారు. సినిమా టికెట్లు, థియేటర్ల నిర్వహణ, పర్సంటేజీలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం. భేటీ అనంతరం కమిటీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నారు.
కాగా ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan kalyan) తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దల వైఖరిపై ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం విధితమే. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాదైనా ఇండస్ట్రీ పెద్దలు సీఎంను మర్యాదపూర్వకంగానైనా కలిశారా ? అని మండిపడ్డారు. సినిమాలకు సంబంధించిన ఏ విషయంపైనైనా ఇకపై వ్యక్తిగత చర్చలు ఉండవని, సినిమా సంఘాల ప్రతినిధులే రావాలని ఆదేశించారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా విశాఖలో సినీ ప్రముఖులు సమావేశం కావడంపై ప్రాధాన్యం ఏర్పడింది.