Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: రాష్ట్ర సంక్షేమం కోసం“చండీరుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహా యాగం”

AP: రాష్ట్ర సంక్షేమం కోసం“చండీరుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహా యాగం”

రాష్ట్ర సంక్షేమం కోసం “చండీరుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహా యాగం” నిర్వహిస్తోంది సర్కారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంక్షేమం కోసం మే 12 నుండి ఆరు రోజులపాటు రాష్ట్ర దేవాదాయశాఖ ఆధ్వర్యంలో చండీరుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహా యాగాన్ని తలపెట్టారు. ఈమేరకు రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ తెలిపారు. మే 12 నుంచి మే 17వ తేదీ వరకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న ఈ యాగానికి సంబంధించిన నిర్వహణ ఏర్పాట్లను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఎంతో పవిత్రమైన ఈ యజ్ణాన్ని రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండేలా, ప్రజలు సౌభాగ్యంతో జీవించేలా రాష్ట్ర సర్వతోముఖాభివృద్దే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోందన్నారు. ఈ మహా క్రతువు మే 12వ తేదీ ఉ.5గం.లకు బ్రహ్మ ముహూర్త కాలంలో ప్రారంభమవుతుందన్నారు. ప్రధానంగా నాలుగు యాగ శాలలు ఉంటాయని, ఒక్కో యాగ శాలలో 108 కలశాలతో యాగం జరుగుతుందన్నారు. ఈ యాగ కార్యక్రమాల్లో 520 మందికి పైగా రుత్వికులు పాల్గొంటారని చెప్పారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, తిరిగి సాయంకాలం 6 గంటల నుంచి 9 గంటల వరకు యాగ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. వీటితోపాటు ప్రతి రోజు అనేక ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామన్నారు.
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో భాగంగా చాగంటి కోటేశ్వరరావు, సామవేదం షణ్ముఖ శర్మ మొదలగు ప్రవచన కర్తలు కూడా పాల్గొని ప్రజలకు వివిధ ప్రవచనాలు ద్వారా హిందూ ధార్మిక పరిరక్షణ తదితర అంశాలను తెలియజేస్తారన్నారు. స్వరూపానందస్వామి, చినజీయర్ స్వామి, కుర్తాళ సిద్ధేశ్వర, మంత్రాలయ, జగద్గురు పండితారాధ్య తదితర పీఠాధిపతులు కూడా పాల్గొంటారన్నారు. యాగ శాలల లోపలికి ఎవరికీ అనుమతి ఉండదని, మే 17 తేదీన చివరి అంకంలో భాగంగా పూర్ణహుతి ఉంటుందన్నారు. యాగం నిర్వహణకు దాదాపు రూ.5 కోట్లు వ్యయం అవుతుందన్నారు. ఈ మహా యజ్ఞాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల సమన్వయం అవసరమని ఇందుకు వీలుగా 13 కమిటీలు పని చేస్తాయన్నారు. ట్రాఫిక్, ప్రోటోకాల్ వంటి అంశాలకు సంబంధించి జిల్లా కలెక్టర్, నగర పోలీస్ కమిషనర్ ల సూచనలు, సలహాలు అమలు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయశాఖ ఉన్నతాధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News