Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్AP: 'గడప గడపకూ మన ప్రభుత్వం'పై వర్క్‌షాప్‌

AP: ‘గడప గడపకూ మన ప్రభుత్వం’పై వర్క్‌షాప్‌

'వై ఏపీ నీడ్స్‌ జగన్‌ ' కార్యక్రమం

ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జగనన్న సురక్ష, గడపగడపకూ మన ప్రభుత్వంపై సీఎం వైయస్‌. జగన్ సమీక్షించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రాంతీయ సమన్వయకర్తలు, ఇతర ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

- Advertisement -

ఈ సందర్భంగా జగన్ వారితో ఏమన్నారంటే…

నాలుగు సంవత్సరాల పరిపాలనలో మన ప్రభుత్వం గొప్పగా, దేశానికే ఆదర్శంగా నిలబడగలిగిన పనులు ఏం చేశాం అన్న విషయాలతో పాటు వాటికి సంబంధించిన ఆధారాలతో సహా అవగాహన కలిగించేలా ‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ అనే కార్యక్రమం ద్వారా చేపట్టబోతున్నామని జగన్ వెల్లడించారు. మనం రాక్షసులతోనూ, మారీచులతోనూ యుద్దం చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ చైతన్యవంతులు అయితేనే మనపై జరుగుతున్న దుష్ప్రచారంపై కూడా తగినవిధంగా తిప్పికొట్టగలిగే పరిస్థితి ఉంటుంది. మనం చేస్తున్న మంచి ఏమిటన్నది ప్రతి మనిషి దగ్గరికి, ప్రతి కుటుంబం దగ్గరికి పదే, పదే తీసుకునిపోవాలి. ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టగలిగే పరిస్ధితిలోకి ప్రతి లబ్దిదారుడుని తయారు కావాలి. ఇది చాలాముఖ్యమైన అంశం.

వచ్చే ఎన్నికల్లో మనం 175 కు 175 నియోజకవర్గాలు గెలవాలి. ఆ దిశగా అడుగులు పడాలి. అదేం కష్టమైన పనికాదు. ఎందుకంటే రాష్ట్రంలో సగటున 87 శాతం గృహాలకు మంచి జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో 92 శాతం గృహాలకు మంచి జరగ్గా…. పట్టణ ప్రాంతాల్లో 84 శాతం మేలు జరిగింది. ప్రతి నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి, ప్రతి గ్రామంలోనూ ఇదే పరిస్థితి. అన్నిచోట్లా ఇదే పరిస్థితి ఉన్నప్పుడు, దేవుడి దయతో మన ప్రభుత్వం మంచి చేయగలిగింది అని ప్రతి ఇంటికి వెళ్లి మనం చెప్పగలిగినప్పుడు.. ఆ ఇంట్లో ప్రతి అక్కకూ, చెల్లెమ్మకు వాళ్ల మనసులో ఇది నిజమేకదా అన్న భావనను తీసుకురావాలి. ఆ భావనే వాళ్ల ఆశీస్సులుగా మారి ఆ ప్రతి ఇళ్లు మనకు ఓటు వేస్తుంది. అది జరిగితే ప్రతి గ్రామం మనకు ఓటు వేస్తుంది. ప్రతి నియోజకవర్గం ఆటోమేటిక్‌గా ఓటు వేసే పరిస్థితి వస్తుంది. ప్రతి ఊరులోనూ ఇంత మంచి జరిగినప్పుడు, ప్రతి ఇంటికి ఈ మంచి జరుగుతున్నప్పుడు మనం కొంచెం కష్టపడి ప్రతి ఇంట్లో ఉన్న అక్కనూ, చెల్లెమ్మనూ కలిసి వాళ్ల ఆశీర్వాదం తీసుకోవాలి.

మీతో పాటు కేడర్‌ను కూడా యాక్టివేట్‌ చేస్తూ.. గృహసారథులను ఏర్పాటు చేసుకుంటూ, వాలంటీర్లను, సచివాలయ కన్వీనర్లును ఏకం చేస్తూ ముందుకు సాగాలి. ఇప్పటికే జగనన్నకు చెబుదాం.. అనే కార్యక్రమం కొనసాగుతోంది. ఎక్కడైనా, ఏదైనా సమస్య మీరు ప్రయత్నం చేసినప్పటికీ పరిష్కారం కాకపోతే దాన్ని పరిష్కరించేట్టుగా భరోసా ఇస్తూ ఈ కార్యక్రమం చేస్తున్నాం. దీనికి అనుబంధంగా, అదనంగా జగనన్న సురక్ష కార్యక్రమం నడుస్తుంది. జగనన్నకు చెబుదాంలో చెప్పే ప్రతి వినతీకూడా దీంట్లో భాగస్వామ్యం అవుతుంది. జగనన్న సురక్ష కార్యక్రమంలో మొత్తం సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ, గృహసారథుల వ్యవస్థ ప్రతి ఇంటికీ వెళ్తుంది. ప్రతి ఇంటికీ వెళ్లి.. జల్లెడ పడుతోంది. పథకాల అమల్లో ఇంకా మిగిలిపోయిన వారు ఎవరైనా, ఎక్కడైనా కూడా ఉండకూడదన్న లక్ష్యంతో జల్లెడ పట్టే కార్యక్రమం జరుగుతుంది. అంటే ఎక్కడైనా మిగిలిపోయిన వారు ఎవరైనా ఉంటే, అది కుటుంబంలో విభజన చేసి వారికి రేషన్‌ కార్డు అందించడంలాంటి వాటి నుంచి వివిధ రకాల సర్టిఫికెట్లు కూడా అక్కడికక్కడే ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. ప్రతి ఇంటికి వెళ్లి కాసేపు గడిపి, సర్టిఫికేట్స్‌ పరంగా, పథకాలు పరంగా సమస్య ఉంటే దాన్ని జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా పరిష్కరిస్తాం.

మండల స్థాయిలో అధికారులు ప్రతి సచివాలయంలో ఒకరోజు పాటు గడుపుతారు. మండలస్థాయి అధికారులతో రెండు బృందాలు ఏర్పడతాయి. తాసీల్దార్, ఈవో పంచాయితీరాజ్‌ ఒక టీంగాను, ఎంపీడీఓ, డిప్యూటీ తాసీల్ధార్‌ ఒక టీమ్‌గా ఏర్పడతారు. షెడ్యూలు ప్రకారం సచివాలయాలకు వెళ్తారు. ఏ తేదీ ఎక్కడకు వెళ్తారో ముందే ప్రకటిస్తారు. ఉత్సాహం ఉన్నవారు ఎవరైనా ఇందులో పాల్గొనవచ్చు.

సచివాలయం పరిధిలో ప్రతి కుటుంబాన్నీ అధికారులతో కూడిన ఈ బృందాలు కలుస్తాయి. ప్రజల వద్ద నుంచి సమస్యలు తెలుసుకోవడం, సర్టిఫికెట్లు జారీకి అవసరమైన డాక్యుమెంట్లు, పథకాల అర్హతకు సంబంధించిన పత్రాలు తీసుకుంటారు. వీటిని పెట్టుకుని తిరిగి గ్రామ, వార్డు సచివాలయాలకు వద్దకు చేరుకుంటారు.అక్కడ ప్రతి వినతికీ సర్వీసు నంబరు, టోకెన్‌ ఇస్తారు. మరలా ఈ టోకెన్లను తిరిగి మళ్లీ ఆయా కుటుంబాలకు ఇస్తారు. వారం తర్వాత అధికారులతో కూడిన బృందం ఆయా గ్రామ, వార్డు సచివాలయాలకు చేరుకుని సర్టిఫికెట్లు జారీచేసే కార్యక్రమం కొనసాగుతుంది. బై యాన్యువల్‌ కార్యక్రమంలో అర్హులైన వారందరికీ కూడా పథకాలు మంజూరుచేస్తారు. ఒక పండగ వాతావరణంలో గ్రామానికి సంబంధించిన సమస్యలన్నీ తీర్చుతారు. దీనివల్ల నూరుశాతం కార్యక్రమం సంతృప్తిగా జరుగుతుంది.

జగనన్న సురక్షా కార్యక్రమంలో ప్రతి గ్రామంలో ఏ చిన్న సమస్య ఉన్న దాన్ని పరిష్కారించడానికి ఏకంగా 1.50 లక్షల మంది సచివాలయ సిబ్బంది, 2.60 లక్షల మంది వాలంటీర్‌ల వ్యవస్ధ, 3వేల మంది మండలస్దాయి సిబ్బంది, 26 మంది సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు, 7.5 లక్షల మంది గృహసారధులు, సచివాలయ కన్వీనర్లు, ప్రతి గ్రామంలోనూ ఒక రోజు కేటాయిస్తూ.. 15వేల క్యాంపులు, 30 రోజులపాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఇంత పెద్ద స్ధాయిలో ప్రతి ఇంటిని జల్లెడ పడుతూ, ప్రతి సమస్యను పరిష్కరించాలన్న ధృక్పధంతో అడుగులు వేసిన పరిస్ధితి దేశ చరిత్రలో ఎక్కడా ఉండదు. ఈ రాష్ట్రంలో జరుగుతుంది.

జగనన్న సురక్షా కార్యక్రమం క్యాంపుల్లో దాదాపు11 రకాల సర్టిఫికెట్లు ఇస్తారు. కులం, ఆదాయం, జనన ధృవీకరణ, వివాహం, ఫ్యామిలీ మెంబర్, డెత్, బియ్యం కార్డులు, కుటుంబాల విభజన, సీసీఆర్సీ, మ్యుటేషన్లు, ఫోన్‌ నంబర్లకు ఆధార్‌ లింకేజి సర్టిఫికెట్లు ఇవన్నీ అందించే కార్యక్రమం జరుగుతుంది.
మండలంలో ప్రతిరోజూ రెండు క్యాంపులు జరుగుతాయి. నియోజవర్గంలో ఎన్ని మండలాలుంటే అన్నింటా రెండేసి క్యాంపులు చొప్పున జరుగుతాయి. ప్రతి క్యాంపు దగ్గర ఎమ్మెల్యేలు కనిపించాలి. జగనన్న సురక్ష కార్యక్రమంపై ఈ నెల 23 నుంచి శిక్షణ కార్యక్రమాలు జరుగుతాయి. జులై 1 నుంచి క్యాంపులు ప్రారంభం అవుతాయి.

గడపగడపకూ మన ప్రభుత్వం…
గడపగడపకూ కార్యక్రమం అత్యంత కీలకం. ఇది చాలా ఉపయోగపడే కార్యక్రమం. ప్రజల్లో పనితీరు బాగుంటే.. ఎమ్మెల్యేలను కొనసాగిస్తాం. గ్రాఫ్‌ బాగోలేకపోతే ఎమ్మెల్యేలను కొనసాగించడం కుదరదు. ప్రతి ఒక్కరూ ఇది గుర్తుంచుకొండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే కొన్నికోట్ల మంది మనపై ఆధారపడి ఉన్నారు. కోట్ల మంది పేదవాళ్లకు మంచి జరుగుతోంది. కొంతమంది ఎమ్మెల్యేలు పనితీరు బాగోలేకపోతే.. వాళ్లను అక్కడే కొనసాగించడం వల్ల వాళ్లకీ నష్టం, పార్టీకీ నష్టం..

కోట్లమంది పేదలకు నష్టం జరుగుతుంది
మనం సర్వే చేసినప్పుడు మీమీ గ్రాఫ్‌లు బలంగా ఉండాలి. దీనికోసం గడపగడపకూ కార్యక్రమం ఉపయోగపడుతుంది. ప్రజలకు చేరువుగా ఉండడానికి బాగా ఉపయోగపడుతుంది. దీనివల్ల మీ గ్రాఫ్‌ పెరుగుతుంది. పార్టీకీ మేలు జరుగుతుంది.

అలా జరగకపోతే.. మార్చక తప్పని పరిస్థితి వస్తుంది
జుట్టు ఉంటే ముడేసుకోవచ్చు. కాబట్టి ఎట్టిపరిస్థితుల్లోనూ మనం గెలవాలి. 175 స్ధానాలకి 175 స్ధానాలు రావాలి. ఇంతకుముందుకన్నా.. బ్రహ్మాండమైన మెజార్టీలు మనకు రావాలి. అది మన లక్ష్యం. అందుకే గడపగడపకూ కార్యక్రమాన్ని మనం సీరియస్‌గా తీసుకోవాలి. గడప గడపకూ కార్యక్రమంలో పనులు కూడా మంజూరు చేస్తున్నాం… వాటిని పూర్తి చేయాలి. ఇకమీదట గడపగడపకూ కార్యక్రమం ముమ్మరం కావాలి. అలా చేయకపోతే… సర్వేలు అనుకూలంగా లేకపోతే, టిక్కెట్లు ఇవ్వకపోతే.. నన్ను బాధ్యుడ్ని చేయొద్దు. రాజకీయాలను సీరియస్‌గా తీసుకోవాలి. ఈ రోజు నుంచి రాబోయే 9 నెలల్లో వేసే ప్రతి అడుగు చాలా కీలకం. గడపగడపకూ కార్యక్రమాన్ని అంతే సీరియస్‌గా తీసుకోవాలి. కచ్చితంగా గెలవాలి.. 175 కి 175 సీట్లు రావాలి. నాలుగేళ్ల కాలంలో రాష్ట్రంలో గతంలో జరగని విధంగా మార్పులను తీసుకు వచ్చాం. దీన్ని వై ఏపీ నీడ్స్‌ జగన్‌ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికీ తెలియజేస్తాం.

నెగెటివ్‌ మీడియాను అడ్డంగా పెట్టుకుని మారీచులు మాదిరిగా యుద్ధంచేస్తున్నారు. ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్న వారితో యుద్ధం చేస్తున్నాం. దానికి సరైన కౌంటర్‌ తయారు చేసి ప్రతి గడపకూ చేర్చాలి. గతంలో చంద్రబాబు ప్రభుత్వ పాలన, ఇవాళ మన ప్రభుత్వం జరిగిన కార్యక్రమాలుతో నాడు – నేడుతో కంటెంట్‌ తయారు చేసి ప్రజల దగ్గరకు చేర్చాలి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 ద్వారా వచ్చే నెగెటివ్‌ స్టోరీలపై నిజాలేంటో ప్రజలకు చెప్పాలి.

సోషల్‌ మీడియా కూడా చాలా ముఖ్యం
ప్రభుత్వం చేస్తున్న మంచిని సోషల్‌ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలి. సోషల్‌ మీడియాను విసృతంగా వాడుకోవాలి. అబద్ధాలు, విషప్రచారాలను పూర్తిస్థాయిలో తిప్పికొట్టాలి. రాబోయే రోజుల్లో మీమీద దుష్ప్రచారం అన్నది కొనసాగిస్తారు. సోషల్‌ మీడియాలో ఇంకా అబద్దాలు ఎక్కువగా సర్క్యులేట్‌ చేసే కార్యక్రమం చేస్తారు. ఇంత దారుణమైన ఎమ్మెల్యే ఎవ్వరూ లేరని వ్యక్తిత్వ హననానికి పాల్పడతారు.
ప్రతి ఒక్కరిపైన వ్యక్తిత్వ హననానికి పాల్పడతారు. వీటిని కౌంటర్‌ చేస్తూ ముందుకు పోవాలి. గ్రామం స్ధాయి నుంచి మన సోషల్‌ మీడియా టీమ్‌లు తయారు చేసుకోవాలి. ఈ కౌంటర్‌ చేసే మెకానిజం కచ్చితంగా ఉండాలి. దీనికి సిద్దంగా ఉండాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News