గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైసీపీని ఘోరంగా ఓడించి కూటమి భారీ మెజార్టీతో అదికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో 175 ఎమ్మెల్యే స్థానాలకు గాను కూటమి పార్టీలు 164 స్థానాల్లో విజయదుందుభి మోగించాయి. ఇక వైసీపీ మాత్రం కేవలం 11 స్థానాలకే పరిమితమై ఘోర పరాజయం మూటగట్టుకుంది. ఈ క్రమంలోనే 2024 జూన్ 12వ తేదీన ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు.
అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా కూటమి ప్రభుత్వం(AP Government) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ‘సుపరిపాలన.. స్వర్ణాంధ్రప్రదేశ్’ పేరుతో రాష్ట్ర స్థాయి వేడుకగా ‘కూటమి ఏడాది పాలన’ నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాల్గొంటారని తెలిపింది.
జూన్ 12వ తేదీ సాయంత్రం ఈ వేడుకలు నిర్వహించనున్నారు. ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి.. సంక్షేమ కార్యక్రమాలు.. భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలకు సంబంధించి ఈ సమావేశంలో వివరించనున్నారు. ఇక జిల్లా స్థాయిలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించింది. ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మరోవైపు ఎమ్మెల్యేలు, ఎంపీలతోనూ సీఎం చంద్రబాబు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేల పనితీరుపై చర్చించనున్నారు. అనవరసమైన వివాదాల జోలికి వెళ్లకుండా.. ప్రజలకు నిత్యం శాసనసభ్యులు అందుబాటులో ఉండాలని సూచించనున్నారు. పనితీరు సరిగా లేని వారిపై చర్యలు తీసుకుంటామని ఇప్పటికే చంద్రబాబు హెచ్చరించారు.
AP Government: రాష్ట్ర స్థాయి వేడుకగా ‘కూటమి ఏడాది పాలన’
సంబంధిత వార్తలు | RELATED ARTICLES