AP Government ON Employees: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉద్యోగ సంఘాల నేతల అభ్యర్ధన మేరకు సీఎం చంద్రబాబు ఉద్యోగుల పెండింగ్ బకాయిలు విడుదల చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన నిర్ణయం మేరకు సీపీఎస్ ఉద్యోగులకు సోమవారం ఏపీ ప్రభుత్వం తొలి విడత బకాయిలను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ద్వారా ఒక్కో ఉద్యోగికి రూ. 40,000 నుంచి రూ. 70,000 వేల బకాయిలను విడుదల చేసింది. ఇప్పటికే వారి ఖాతాల్లో నగదు జమ చేసినట్లు పేర్కొంది. గత వైసీపీ ప్రభుత్వంలో పేరుకుపోయిన పెండింగ్ బకాయిలను విడతల వారీగా క్లియర్ చేస్తామని సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఫస్ట్ ఫేజ్ బకాయిలను విడుదల చేసింది.
బకాయిల విడుదలపై ఉద్యోగుల హర్షం..
అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ఉద్యోగులకు ఈ ఏడాది మార్చిలో రూ. 6200 కోట్లను విడుదల చేసింది. సీసీఎస్, జీపీఎఫ్, ఏపీజీఏఐ కింద ఈ బకాయిలను రిలీజ్ చేసింది. మ్యాచింగ్ గ్రాంట్లను ఉద్యోగుల ప్రాన్ ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. అంతేకాదు, ఈ ఏడాది జనవరిలో సీపీఎస్ ఉద్యోగులకు రూ.1,033 కోట్ల బకాయిలను సైతం విడుదల చేసింది. గత ప్రభుత్వం ఉద్యోగులకు రూ. 25 వేల కోట్లు చెల్లించాల్సి ఉండగా.. వీటిని చంద్రబాబు సర్కార్ విడుతల వారీగా క్లియర్ చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే ఉద్యోగుల ప్రాన్ ఖాతాల్లో ఈ ఏడాది రూ. 2300 కోట్లను జమ చేసింది. తమ ఖాతాల్లో బకాయిలు జమ కావటం పైన ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు అండగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు చెబుతున్నారు. ఇదే మాదిరిగా పెండింగ్ డీఏలు కూడా చెల్లించాలని కోరుతున్నారు. కాగా, కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన తరువాత డీఏల విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
హామీని నిలబెట్టుకోవాలని సీఎంకు విజ్ఞప్తి..
ఇదిలా ఉండగా.. పాత పెన్షన్ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ మేరకు సీఎం చంద్రబాబు దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లారు. అంతేకాదు, పీఆర్సీ కమిషన్ ఏర్పాటు పైన ఉద్యోగ సంఘాల నేతలు ప్రస్తావిస్తున్నారు. అయితే, రాష్ట్ర ఆర్దిక పరిస్థితుల కారణంగా కొంత సమయం తీసుకునే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.


