AP Govt New Scheme: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఊరటనిచ్చే చర్యలు చేపట్టింది. స్కూల్కు దూరంగా ఉండే బాలబాలికలకు ఏడాదికి రూ.6,000 చొప్పున రవాణా ఖర్చుల కోసం సాయం అందించనుంది. సమగ్ర శిక్షా అభియాన్ పరిధిలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు.
ట్రావెల్ అలవెన్స్..
ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారుగా 79,860 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. మొత్తం రూ.47.91 కోట్లు ట్రావెల్ అలవెన్స్గా కేటాయించారు. ఈ మొత్తాన్ని విద్యార్థుల తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నట్టు అధికారులు తెలిపారు.
విద్యా హక్కు చట్టంలోని ప్రమాణాలను అనుసరించి టీఏ (ట్రాన్స్పోర్ట్ అలవెన్స్) అందించనున్నారు. ఒకటవ తరగతి నుండి 8వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకే ఈ అవకాశం వర్తిస్తుంది. విద్యార్థి నివసించే ప్రాంతం నుండి సంబంధిత పాఠశాల వరకు దూరం ఎక్కువగా ఉంటేనే ఈ పథకం వర్తిస్తుంది.
రవాణా సదుపాయాలను..
ప్రాథమిక పాఠశాల కోసం కనీసం ఒక కిలోమీటరు దూరం, ప్రాథమికోన్నత పాఠశాల కోసం మూడు కిలోమీటర్లు, సెకండరీ పాఠశాల కోసం ఐదు కిలోమీటర్లు దాటిన సందర్భంలో మాత్రమే టీఏ వర్తిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఉన్న విద్యార్థులకు ప్రతి నెలా రూ.600 చొప్పున, ఏడాదికి రూ.6,000 చెల్లించనున్నారు. ఈ డబ్బుతో విద్యార్థులు బస్సులు లేదా ఇతర రవాణా సదుపాయాలను వినియోగించుకోవచ్చు.
అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్లు..
ఇందులో ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుతున్న విద్యార్థులే అర్హులు. ప్రైవేట్ స్కూళ్లలో చేరిన వారు ఈ పథకానికి అర్హులు కారు.అర్హులైన విద్యార్థుల వివరాలను ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ గుర్తించి, లీప్ యాప్లో నమోదు చేసింది. ఈ సమాచారం ఎంఈవోలు పరిశీలించాక, అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్లు ధృవీకరిస్తారు. అనంతరం జిల్లా స్థాయిలో అధికారుల సమీక్ష తర్వాత ఆగస్టు 10 నాటికి తుది లబ్ధిదారుల జాబితా ఖరారు చేయనున్నారు.
ఈ జాబితా తుది ధృవీకరణకు అనంతరం తల్లిదండ్రుల ఖాతాలకు నేరుగా డబ్బులు జమ చేస్తారు. విద్యా సంవత్సరానికి సంబంధించి 10 నెలల పాటు టీఏ అందే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.ఇంత వరకు ఒకేసారి మొత్తం మొత్తాన్ని ఇచ్చేవారు. అయితే ఈసారి నెలవారీగా చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది విద్యార్థులకు మరింత ఉపయోగకరంగా మారనుంది.
పరిశీలన ప్రక్రియ పూర్తయ్యాక, ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకు బ్యాంక్ ఖాతా ద్వారా నిధులు అందుతాయి. ఈ పథకం వల్ల పాఠశాల దూరం కారణంగా విద్య మానేసే పరిస్థితులు తగ్గే అవకాశాలు ఉన్నాయి.ఈ పథకం అమలుతో రాష్ట్రంలో విద్యార్థుల హాజరును మెరుగుపరిచే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.


