ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బలాన్ని పెంచుతూ ముగ్గురు సీనియర్ న్యాయమూర్తుల బదిలీకి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తాజాగా ఆమోద ముద్ర వేశారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన మేరకు ఈ బదిలీలు ఖరారయ్యాయి. గుజరాత్ హైకోర్టు నుంచి సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, అలహాబాద్ హైకోర్టు నుంచి జస్టిస్ డూండి రమేష్, కలకత్తా హైకోర్టు నుంచి జస్టిస్ సుబేందు సమంత… ఇకపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తమ సేవలను అందించనున్నారు.
గతంలోనే కొలీజియం ఈ ముగ్గురు ప్రతిభావంతులైన జడ్జిలను ఏపీకి బదిలీ చేయాలని ప్రతిపాదించగా, ఇప్పుడు రాష్ట్రపతి ఆమోదంతో అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ బదిలీల ద్వారా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయ ప్రక్రియ మరింత వేగవంతం అవుతుందని, న్యాయవ్యవస్థకు మరింత బలం చేకూరుతుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


