Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి మంత్రులు లోకేశ్, నారాయణ, టీజీ భరత్ సింగపూర్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా తాజాగా.. సింగపూర్ లో తెలుగు డయాస్పోరా వాలంటీర్లతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఐదేళ్ల విధ్వంస పాలన చూశాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు విదేశాల్లో ఉన్న తెలుగువారంతా స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని అన్నారు. సింగపూర్ అభివృద్ధి చెందిన తీరును స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పారు. సింగపూర్ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని పేర్కొన్నారు.
మీరంతా కలిసి చేయాలి..
‘‘గత ఐదేళ్ల విధ్వంస పాలన చూసి తెలుగువారంతా ముందుకొచ్చారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు విదేశాల్లోని తెలుగువారంతా ముందుకొచ్చారు. ఏదేశం వెళ్లినా సీఎం చంద్రబాబు, నేను ముందుగా తెలుగువాళ్లను కలవాలని నిర్ణయించుకున్నాం. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది. ప్రధాని మోదీ త్వరలోనే సింగపూర్లో పర్యటిస్తారు. మోదీ పర్యటనలోనూ తెలుగువారంతా పాల్గొని విజయవంతం చేయాలి’’ అని లోకేశ్ అన్నారు.
నేర్చుకోవాల్సింది చాలా ఉంది..
నారా లోకేశ్ ‘ఎక్స్’లోనూ ఓ పోస్టు చేశారు. రాజకీయాల కన్నా అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడంపై సింగపూర్ నుంచి స్ఫూర్తి పొందాలన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఈ పర్యటనను సద్వినియోగం చేసుకుంటామన్నారు. అలానే రాష్ట్రానికి సహకరిస్తోన్న ప్రధానికి కృతజ్ఞతలు తెలపాలని మంత్రి లోకేశ్ విజ్ఞప్తి చేశారు. తెలుగు డయాస్పోరా సమావేశాన్ని విజయవంతం చేసిన వాలంటీర్లను అభినందించిన లోకేశ్ వారితో కలిసి ఫోటోలు దిగారు. కాగా, రాష్ట్రాభివృద్ధికి అవసరమైన పెట్టుబడులను ఆకర్షించేందుకు, పారిశ్రామిక అభివృద్ధికి అవసరమైన అంతర్జాతీయ సహకారాన్ని తీసుకురావడమే ఈ సింగపూర్ పర్యటనకు ముఖ్య ఉద్దేశం.


