గత వైసీపీ ప్రభుత్వం హయాంలో మద్యం కుంభకోణం(AP liquor Scam) జరిగిందంటూ కూటమి ప్రభుత్వం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ స్కాంపై విచారణ చేపట్టిన సీఐడీ అధికారులు ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో మాజీ సీఎం జగన్ కార్యాలయ అధికారి ధనుంజయ్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, భారతి సిమెంట్స్ పూర్తిస్థాయి డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ, జగన్ సన్నిహితుడు రాజ్ కెసిరెడ్డి ఉన్నారు.
వీరి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు అధికారులు కస్టడీకి కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం నిందితులను రెండ్రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు తీర్పుతో ఈ నలుగురు నిందితులను సిట్ అధికారులు శుక్రవారం, శనివారం విచారించనున్నారు. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని ఆదేశించింది.