ఏపీలో కలకలం రేపుతున్న లిక్కర్ స్కామ్ కేసులో.. SIT చర్యలు వేగం పెంచింది. ఇప్పటికే కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని అరెస్టు చేసిన సిట్, అతని అనుచరుడు చాణక్యను పట్టుకుంది. తాజాగా ఈ కేసులో మరో కీలక వ్యక్తి అయిన ఏ6 నిందితుడు సజ్జల శ్రీధర్ రెడ్డిని కూడా అరెస్టు చేసింది. దీంతో ఇప్పటివరకు మూడు కీలక అరెస్టులు నమోదు అయ్యాయి.
గత రెండు నెలలుగా విచారణను ముమ్మరం చేసిన సిట్ ఇప్పుడు నిందితుల అరెస్టులపై దృష్టి సారించింది. వరుసగా అరెస్టులు జరుగుతుండటంతో, త్వరలో మరిన్ని అరెస్టులు జరగొచ్చని సంకేతాలు కనిపిస్తున్నాయి. మొదటగా కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని అరెస్టు చేసిన సిట్, ఆ వెంటనే చాణక్యను పట్టుకుని, తాజాగా శ్రీధర్ రెడ్డి అరెస్ట్తో కేసు మరింత వేగం పుంజుకుంది.
సిట్ అందించిన సమాచారం ప్రకారం, శ్రీధర్ రెడ్డి లిక్కర్ సిండికేట్లో కీలక పాత్ర పోషించాడని తెలుస్తోంది. ముఖ్యంగా మద్యం బ్రాండ్లకు రాష్ట్రంలో అనుకూలమైన పరిస్థితులు కల్పించేందుకు చురుకుగా వ్యవహరించాడు. లిక్కర్ ఆర్థర్ ఫర్ సప్లై (OFS) లను చట్ట విరుద్ధంగా జారీ చేయడంలో శ్రీధర్ రెడ్డి ప్రధాన పాత్ర పోషించినట్టు సిట్ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది.
అంతేకాక, ముడుపులు, కమిషన్ల ద్వారా వచ్చిన డబ్బును సేకరించి, ఆయా కంపెనీలకు మళ్లించడంలో శ్రీధర్ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. డిస్టిలరీస్ ను సమన్వయం చేసి సిండికేట్ సభ్యులకు సకాలంలో డబ్బు అందేలా చూడటం, వాసుదేవ రెడ్డి, సత్యప్రసాద్ లకు నచ్చిన కంపెనీలకు ఆర్థర్ ఫర్ సప్లై జారీ చేయించటం వంటి చర్యల్లో కూడా శ్రీధర్ రెడ్డి పాత్ర ఉందని సిట్ ఆరోపించింది.
ప్రస్తుతం శ్రీధర్ రెడ్డి నుంచి డబ్బు లావాదేవీల వివరాలు, ముడుపుల పంపకాల గురించి కీలక సమాచారం వెలికితీయాలని సిట్ యత్నిస్తోంది. ఈ నేపథ్యంలో, మరిన్ని అరెస్టులు జరగడం ఖాయమనే అంచనాలు వేగంగా వినిపిస్తున్నాయి.