Nara lokesh receives grand welcome in Sydney: ఏపీ ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఆరు రోజుల పర్యటన నిమిత్తం ఆస్ట్రేలియా చేరుకున్నారు. సిడ్నీ విమానాశ్రయంలో నారా లోకేశ్కు ఘన స్వాగతం లభించింది. ఆస్ట్రేలియాలోని టీడీపీ శ్రేణులతో పాటుగా తెలుగు ప్రజలు కుటుంబ సమేతంగా విచ్చేసి లోకేశ్కు స్వాగతం పలికారు. టీడీపీ ఆస్ట్రేలియా అధ్యక్షుడు విజయ్, ఉపాధ్యక్షుడు సతీష్ ఆధ్వర్యంలో తెలుగు ఎన్నారైలు సిడ్నీ విమానాశ్రయానికి చేరుకుని మంత్రి లోకేశ్ను సాదరంగా ఆహ్వానించారు. దీంతో లోకేశ్ అందరినీ ఆప్యాయంగా పలకరించారు. సరదాగా వారితో ఫోటోలు దిగారు. లోకేశ్ రాకతో సిడ్నీ విమానాశ్రయంలో టీడీపీ జెండాలు రెపరెపలాడాయి. సిడ్నీలో పెద్ద ఎత్తున స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు అయ్యాయి.
Also Read:https://teluguprabha.net/andhra-pradesh-news/cm-chandrababu-clears-pending-da-installments/
స్పెషల్ విజిట్స్ ప్రోగ్రాంలో పాల్గొనాల్సిందిగా ఆస్ట్రేలియా ప్రభుత్వం తరఫున ఆ దేశ హై కమిషనర్ ఆహ్వానం మేరకు నారా లోకేశ్ ఆస్ట్రేలియా వెళ్లారు. ఈ నెల 19 నుంచి 24 వరకు లోకేశ్ ఆస్ట్రేలియాలోని పలు ప్రాంతాలను పర్యటించనున్నారు. ఆ దేశంలోని విశ్వవిద్యాలయాల్ని సందర్శించి అధునాతన బోధనా పద్ధతుల్ని లోకేశ్ అధ్యయనం చేస్తారు. అంతే కాకుండా నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలో జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుకు పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో మంత్రి నారా లోకేశ్ ఆస్ట్రేలియాలోని సిడ్నీ, మెల్ బోర్న్ నగరాల్లో రోడ్ షోలు నిర్వహించనున్నారు. పలువురు పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులతో చర్చలు జరిపి రాష్ట్రాన్ని సందర్శించాల్సిందిగా లోకేశ్ ఆహ్వానించనున్నారు. ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ ఆవరణలో తెలుగు డయాస్పోరాతో మంత్రి లోకేశ్ సమావేశమవుతారు.


