Ambati Rambabu Jail: ఏపీ రాజకీయాల్లో హీటు రోజురోజుకూ పెరిగిపోతోంది. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేసి, కోర్టు ఆదేశాల మేరకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు. దీంతో ఆయనను రాజమండ్రి జైలుకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో కోర్టులో హాజరు పరిచిన సమయంలో నల్లపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ వంశీ, మరో ఇద్దరు ఇన్స్పెక్టర్లతో కలిసి తనను శారీరకంగా వేధించారని అంబటి ఆరోపించారు.
గత ఎన్నికల సమయంలో సత్తెనపల్లి నియోజకవర్గంలో జరిగిన కొన్ని అల్లర్లు, ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి అంబటి రాంబాబుపై పలు కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా ఒక సామాజిక వర్గాన్ని కించపరిచారనే ఆరోపణలతో పాటు, విధి నిర్వహణలో ఉన్న అధికారులను అడ్డుకున్నారనే ఫిర్యాదులు ఆయనపై ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాత కేసుల ఫైళ్లు కదలడంతో, విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే ఆయన స్పందన సరిగ్గా లేదన్న కారణంతో పోలీసులు అరెస్ట్ ప్రక్రియను వేగవంతం చేశారు.
also read Faria Abdullah: చీరకట్టులో మతిపోగొడుతున్న జాతిరత్నాల చిట్టి
అరెస్ట్కు కొన్ని గంటల ముందు అంబటి రాంబాబు నివాసం వద్ద హైడ్రామా నడిచింది. భారీగా మోహరించిన పోలీసులను చూసి వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రభుత్వ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనను వేధిస్తున్నారని అంబటి ఈ సందర్భంగా మీడియా ముందు మండిపడ్డారు. ప్రశ్నించే గొంతును నొక్కేయాలని చూస్తున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. చివరకు పోలీసులు ఆయన్ని అదుపులోకి తీసుకుని మెడికల్ చెకప్ అనంతరం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
అంబటి అరెస్ట్తో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ చర్యను తీవ్రంగా ఖండించగా.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలుగుదేశం, జనసేన నేతలు స్పష్టం చేస్తున్నారు. రాజమండ్రి జైలు ఇప్పుడు రాజకీయ నాయకుల రాకపోకలతో కీలక కేంద్రంగా మారింది. గతంలో ఇదే జైలులో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వైసీపీ సంబరాలు చేసుకుంటే.. ఇప్పుడు అదే పార్టీకి చెందిన కీలక నేత అక్కడకు చేరడం కాలచక్రం తిరిగినట్లు కనిపిస్తోందని రాజకీయ పండితులు అంటున్నారు.

