APPSC Latest job Notification: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆయా పోస్టులకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఐటీఐ, డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 21 పోస్టులను భర్తీ చేయనుంది. దీనిలో డ్రాట్స్మెన్ గ్రేడ్-2 (టెక్నికల్ అసిస్టెంట్), అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్, హర్టీకల్చర్ ఆఫీసర్, జూనియర్ లెక్చరర్ (లైబ్రరీ సైన్స్), హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ వంటి పోస్టులు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 18 నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. విభాగాల వారీగా ఖాళీలు, అర్హత, వయోపరిమితి విషయాల గురించి తెలుసుకుందాం.
ఏ విభాగంలో ఎన్ని ఖాళీలు?
ఈ నోటిఫికేషన్ ద్వారా ఏపీపీఎస్సీ 13 డ్రాట్స్మెన్ గ్రేడ్-2 (టెక్నికల్ అసిస్టెంట్) పోస్టులు, 3 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ పోస్టులు, 2 హర్టీకల్చర్ ఆఫీసర్ పోస్టులు, 2 జూనియర్ లెక్చరర్ (లైబ్రరీ సైన్స్) పోస్టులు, 1 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టును భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు.. ఆయా పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిగ్రీ, బీటెక్ (సివిల్), బీఈడీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు తప్పనిసరిగా 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీకి చెందిన వారికి నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అర్హత కలిగిన అభ్యర్ధులు ఆన్లైన్ విధానంలో అక్టోబర్ 8వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు కింద జనరల్ అభ్యర్ధులు రూ.250, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.120 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. రాత పరీక్ష ఆధారంగా ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది.
ఎంపికైతే భారీ వేతనం..
ఎంపికైన అభ్యర్థులకు ఆయా పోస్టును బట్టి జీతభత్యాలు ఉంటాయి. డ్రాట్స్మెన్ పోస్టుకు ఎంపికైన వారికి నెలకు రూ.34,580 నుంచి రూ.1,07,210 వరకు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుకు రూ.57,100 నుంచి రూ.1,47,760 వరకు, హర్టీకల్చర్ ఆఫీసర్ పోస్టుకు రూ.54,060 నుంచి రూ.1,40,540 వరకు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుకు రూ.37,640 నుంచి రూ.1,15,500 వరకు, జూనియర్ లెక్చరర్ పోస్టుకు రూ.57,100 నుంచి రూ.1,47,760 వరకు జీతభత్యాలు చెల్లిస్తారు. దరఖాస్తు విధానం, అర్హత, ఎంపిక ప్రక్రియకు సంబంధించిన మరిన్ని వివరాల కొరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్ను సందర్శించండి.


