Arrest of Janasena Leader due to Alligations over Bojjala Sudher Reddy: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రీకాళహస్తి రాయుడు హత్య కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ కేసులో టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి సంబంధం ఉందంటూ పోస్ట్ పెట్టినందుకు గానూ జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లును పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతిలోని వెంకటగిరిలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే, వెంకటేశ్వర్లు తన పోస్టులో బొజ్జల సుధీర్ రెడ్డిని టార్గెట్ చేస్తూ పలు సంచలన ఆరోపణలు చేశాడు. శ్రీకాళహస్తి జనసేన నేత కోటా వినూతకు న్యాయం చేయాలని, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని వెంకటేశ్వర్లు డిమాండ్ చేశాడు. దీంతో, ఆ పోస్టు వైరల్గా మారింది. ఈ క్రమంలో కూటమి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మాట్లాడినందుకే అరెస్ట్ చేశారని విమర్శలు వస్తున్నాయి. వెంకటేశ్వర్లు అరెస్ట్పై ఆయన కుటుంబ సభ్యులు, జనసేన నేతలు మండిపడుతున్నారు. వెంకటేశ్వర్లను పోలీసులు దౌర్జన్యంగా తీసుకెళ్లారని, స్నానం చేస్తున్నారని చెప్పిన వినిపించుకోలేదని వాపోయారుజ కావాలనే వెంకటేశ్వర్లుపై తప్పుడు కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాయుడు సెల్ఫీ వీడియోతో కలకలం..
ఇదిలా ఉండగా.. శ్రీకాకుళం జనసేన ఇన్ఛార్జ్ కోట వినుత, ఆమె భర్త చంద్రబాబు ప్రైవేటుగా ఉన్న వీడియోలు పంపితే తనకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి రూ.30 లక్షలు ఇస్తానని చెప్పారంటూ వినుత మాజీ డ్రైవర్ రాయుడు గతంలో విడుదల చేసిన ఓ సెల్ఫీ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 19 నిమిషాల 42 సెకన్ల సెల్ఫీ వీడియో బయటకు రావడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం సృష్టించింది. ఈ వీడియోలో, రాయుడు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి మనుషులు తనను సంప్రదించి, వినుత దంపతులను చంపాలని లేదా కనీసం కోట వినుత ప్రైవేట్ వీడియోలు తీసి పంపాలని బెదిరించారని, అందుకు డబ్బు కూడా ఆఫర్ చేశారని తెలిపాడు. అయితే అప్పట్లో అది అతనే తీశాడా? లేక కోటా దంపతులు బెదిరించి తీయించారా? లేదా ఇది మార్ఫింగ్ వీడియోనా? అనే విషయం తెలియాల్సి ఉంది. ఈ హత్య ఘటన తరువాత కోట వినుత ఆమె భర్తను జనసేన పార్టీ సస్పెండ్ చేసింది. శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్యకు గురయ్యారు. జూలై 7న హత్య జరిగి, జూలై 13న చెన్నైలోని కూవం నదిలో ఆయన మృతదేహం లభ్యమైంది. ఈ హత్య కేసులో కోట వినుత, ఆమె భర్త చంద్రబాబుతో సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో కోట వినుతకు చెన్నై సెషన్స్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆమె భర్త చంద్రబాబు (ఏ1) సహా మిగిలిన నిందితులు ఇంకా జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్నారు.


