Bhogapuram Airport Credit:విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ వేళ ఏపీ రాజకీయాల్లో క్రెడిట్ యుద్ధం తెరమీదకి వచ్చింది. భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ ఎవరిదనే చర్చ ఓ రేంజ్ లో నడుస్తోంది. . వైసీపీ హయాంలో భూసేకరణ, అనుమతులు వచ్చి పనులు జరిగాయని మాజీ సీఎం జగన్ చెబుతుంటే… టీడీపీ హయాంలో శంకుస్థాపన, భూసేకరణ చేశామని.. కూటమి ప్రభుత్వం వచ్చి పనులు వేగవంతం చేసి రెండేళ్లలో ఎయిర్పోర్ట్ ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చినట్లు చంద్రబాబు అంటున్నారు.
క్రెడిట్ వార్..
దీంతో ఈ క్రెడిట్ వార్పై ఏపీ రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా స్పందించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ చంద్రబాబు, జగన్లది కానే కాదంటూ ఆసక్తికర ట్వీట్ చేసి మరో ఆసక్తికర అంశానికి తెరలేపారు.
భోగాపురం ఎయిర్పోర్ట్క్రెడిట్ ఎవరిది అనే విషయం గురించి.. కొట్టుకోవడం ఆపాలన్నారు ఏబీ వెంకటేశ్వరరావు. ఈ క్రెడిట్ చంద్రబాబు కానీ, జగన్ ది కానీ కాదని..ఈ ఎయిర్పోర్ట్ క్రెడిట్ మొత్తం జీఎంఆర్ది అంటూ ట్వీట్ చేశారు. అవసరమైనదానికంటే చాలా ఎక్కువగా 5000 ఎకరాలకు భూసేకరణ నోటిఫికేషన్లు వాస్తవం అన్నారు. భూములు కోల్పోయే వాళ్ల ఆందోళనలు నిజం.. ఆ ఆందోళనలకు అప్పట్లో ప్రతిపక్షం సమర్ధన కూడ వాస్తవమేనన్నారు. బలవంతాన, అతి కష్టం మీద భూమి పరిమితిని దాదాపు 3000 ఎకరాలకు కుదించారని.. విమానాశ్రయం నిర్మాణానికి వేలం ద్వారా బిడ్లు ఆహ్వానించారన్నారు.
ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బిడ్డు గెలుచుకోవడం కూడా వాస్తవమేనని.. జీఎంఆర్ కోసం ఆ వేలాన్ని క్యాన్సిల్ చేయడం కూడా వాస్తవం అని బాంబ్ పేల్చారు.వేలం నిబంధనలని సవరించి తిరిగి వేలం వెయ్యడం, ముందుగానే ‘నిర్ణయించిన’ ప్రకారం జీఎంఆర్ కి అప్పజెప్పారు. అక్కడ మొదలైన పనులను జగన్ ప్రభుత్వం నిలిపివేయించడం వంటి విషయాల గురించి ఏబీ ప్రస్తావించారు. కాకినాడ SEZ లో జీఎంఆర్ వాటాలను అరబిందోకు అప్పజెప్పడంతో పాటు ఇంకొన్ని ‘విషయాల్లో’ డీల్ కుదిరిందని చెప్పుకొచ్చారు.
Also Read:IMD: రైతన్నలకు చేదు కబురు…ఆగస్టు..సెప్టెంబర్ లో వర్షాలు లేవు
2023 లో పనులు తిరిగి ప్రారంభించడానికి అనుమతులు వచ్చాయి. ఇప్పటి మంత్రి రామ్మోహన్ నాయుడు దగ్గరుండి పనులు వేగవంతం చేశారు. కావాల్సిన సదుపాయాలు, కనెక్టింగ్ రోడ్లకు మన పేద రాష్ట్ర ప్రభుత్వం డబ్బు బాగానే ఖర్చు పెట్టింది. బట్టల షాపింగ్ మాల్ లాంటి సంస్థ ప్రారంభానికి కోట్ల ఖర్చుతో ప్రభుత్వం హడావుడి చేస్తోంది. 13,000 మందితో ధింసానృత్యాలు, ‘అల భోగాపురంలో’ అంటూ కొన్ని పత్రికల కేరింతలు.. విజయవాడ ఎయిర్ పోర్ట్ పనులు ఎక్కడివక్కడే, ఇన్నేళ్ళకూ డైలీ ఒక్క అంతర్జాతీయ సర్వీసూ లేకపోవడం, తేకపోవడం చేదు వాస్తవం.
వాట్సాప్ యుగంలో ప్రజల జ్ఞాపక శక్తి మీద అందరికీ చులకన.. అందుకే ఒక వరుసలో గుర్తు చెయ్యడం.. ఇవన్నీ రికార్డు మీదున్న వాస్తవాలే.. ఇప్పుడు నిర్ణయించుకోండి, భోగాపురం భోగం ఎవరిది, క్రెడిట్ ఎవరిది?’ అని ఏబీ వెంకటేశ్వరరావు ట్వీట్ చేశారు.

