Bhogapuram Airport trial run: ఉత్తరాంధ్ర వాసుల దశాబ్దాల కల, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే సరికొత్త అద్భుతం భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం సాకారమవుతోంది. అభివృద్ధిలో ‘గేమ్ ఛేంజర్’గా భావిస్తున్న ఈ విమానాశ్రయంపై జనవరి 4న తొలి వాణిజ్య విమానం ల్యాండ్ కాబోతుండటం విశేషం. దిల్లీ నుంచి బయలుదేరే ఎయిర్ ఇండియా విమానంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సహా ఉన్నతాధికారులు భోగాపురంలో అడుగుపెట్టనున్నారు.
అభివృద్ధికి చిరునామా: అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరిట రూపుదిద్దుకుంటున్న ఈ విమానాశ్రయం, కేవలం ప్రయాణ సాధనం మాత్రమే కాదు.. ఉత్తరాంధ్ర జిల్లాల భవిష్యత్తుకు భరోసా. 24 గంటల విమాన సర్వీసులు, అంతర్జాతీయ కనెక్టివిటీ మరియు వేలాది కొత్త ఉద్యోగాలతో విశాఖపట్నం దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఆర్థిక కేంద్రంగా అవతరించబోతోంది.
Also Read: Nara Lokesh – పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానం
రికార్డు వేగంతో నిర్మాణం
శంకుస్థాపన: 3 మే 2023న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసి, 2026 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని లక్ష్యంగా పెట్టుకున్నారు.కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పర్యవేక్షణలో పనులు ఊహించని వేగంతో సాగుతూ, గడువు కంటే ముందే సిద్ధమైంది. జీఎంఆర్ (GMR) గ్రూప్ ఆధ్వర్యంలో, ఎల్ అండ్ టీ (L&T) సంస్థ పౌర పనులను చేపట్టింది. వచ్చే 40 ఏళ్ల పాటు దీని నిర్వహణ బాధ్యతలను వీరే చూసుకోనున్నారు.
ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు
సుమారు 3.8 కిలోమీటర్ల పొడవైన రన్వేతో, ప్రపంచంలోనే అతిపెద్ద విమానాలైన ఎయిర్ బస్ A380, బోయింగ్ 747-8 వంటి భారీ విమానాలు (Wide-body aircraft) సైతం ఇక్కడ సులభంగా ల్యాండ్ అయ్యేలా అత్యాధునిక సాంకేతికతతో దీనిని నిర్మించారు.
జనవరి 4న జరిగే ఈ ట్రయల్ రన్ విజయవంతం అయిన తర్వాత, మే నెల నుంచి పూర్తిస్థాయి వాణిజ్య రాకపోకలు సాగించేలా మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోంది. త్వరలోనే అంతర్జాతీయ విమానయాన సంస్థలు కూడా భోగాపురం నుంచి తమ సేవలను అందించనున్నాయి. మొత్తానికి, భోగాపురం విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ఒక మైలురాయిగా నిలవబోతోంది!

