Pitapuram Varma: వరుస వివాదాలతో అధిష్టానికి తలనొప్పిగా మారిన వర్మ విషయంలో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో చోటుచేసుకుంటున్న వరుస వివాదాలకు చెక్ పెడుతూ.. ప్రస్తుతం టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న ఎస్వీఎస్ఎన్ వర్మను ఆ బాధ్యతల నుంచి తప్పించారు. అక్కడ పార్టీ వ్యవహారాల కోసం వీలైనంత త్వరగా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది.
పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా సహకరిస్తా.. వర్మ
అయితే, తనను ఇంఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించడంపై వర్మ స్పందించారు. పార్టీ అధినేత చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాల కోసం వీలైనంత త్వరగా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలన్న అధిష్టానం నిర్ణయంపైనా ఆయన స్పందించారు. ‘‘రకరకాల సమీకరణలతో పార్టీలో మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. అంతమంగా పార్టీ బాగుండాలనేదే నా లక్ష్యం. మంత్రి నారా లోకేశ్తో మాట్లాడిన తర్వాతే పిఠాపురం టీడీపీ నూతన కమిటీ ఏర్పాటు నిర్ణయం జరిగింది. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి నేను పూర్తిగా కట్టుబడి ఉంటాను. పార్టీ తీసుకునే నిర్ణయానికి సహకరిస్తా’’ అని వర్మ తెలిపారు. అయితే, కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇక్కడి నుంచే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పొత్తులో భాగంగా ఈ సీటును అధిష్టానం పవన్ కళ్యాణ్కు కేటాయించగా. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తూ వర్మ తన సీటును త్యాగం చేసి మరీ పవన్ కళ్యాణ్ గెలుపునకు సహకరించారు. అయితే, ఆ తరువాత పరిణామాలతో స్థానికంగా వివాదాలు తలెత్తుతున్నాయి. టీడీపీ, జనసేన వర్గాలు ఒకరినొకరు నువ్వా నేనా అంటూ తలపడుతున్నారు. ఈ వివాదాలకు చెక్ పెట్టేందుకు పార్టీ అధినేత తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

