Case on YSRCP Ex MLA Bolla Brahmanaidu: హైదరాబాద్లో రూ.1,500 కోట్ల విలువైన భూమి కబ్జాకు యత్నించిన ఏపీకి చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై కేసు నమోదైంది. ఈ కేసుపై వివరాలు వెల్లడించిన శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్.. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు చెప్పారు. నకిలీ పత్రాలతో బ్రహ్మనాయుడు, మరికొందరు కలిసి గండిపేటలో భూమి కబ్జాకు ప్రయత్నించారని, ఈ విషయం గండిపేట తహసీల్దారు ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిందన్నారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి.. గండిపేట సర్వే నెంబర్ 18లో భూమిని కబ్జా చేసేందుకు బ్రహ్మనాయుడు యత్నించినట్లు డీసీపీ వెల్లడించారు. నకిలీ పత్రాలను సృష్టించిన ముగ్గురు వ్యక్తులు నిమ్మల రాజేశ్ గౌడ్, వేణుగోపాల్, సాయి కిరణ్లను ఇప్పటికే అరెస్టు చేసినట్లు చెప్పారు. అయితే, ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, బొల్లా రమేశ్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఈ సర్వే నెంబర్లోని భూమిని క్రమబద్ధీకరించిందని తప్పుడు జీవోలు సృష్టించారని, ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. అప్రమత్తమైన గండిపేట తహసీల్దార్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
Also read: Revanth government: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్.. రూ.2 వేల కోట్లు పెండింగ్ బకాయిలు విడుదల
ఎకరా రూ.3.5 కోట్లకు విక్రయించేలా ప్లాన్..
చట్టబద్ధమైన హక్కులు లేకుండానే భూమిని విక్రయించాలని కుట్ర చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు డీసీపీ వెల్లడించారు. ఎకరా రూ.3.5 కోట్లకు విక్రయించేలా ప్లాన్ చేశారని పోలీసు అధికారులు వెల్లడించారు. కోర్టు ఆదేశాలతో నిందితుల ఇళ్లలో సోదాలు నిర్వహించి బ్యాంకు పాస్ పుస్తకాలు, మొబైల్, ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ భూమికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు తమ విచారణలో తేలిందన్నారు.

