ఏపీ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. విశాఖ, విజయవాడ మెట్రోరైలు(Metro Rail) ప్రాజెక్టుల సీఎంపీ కోసం నిధులు మంజూరు చేసింది. ఈ రెండు మెట్రో ప్రాజెక్టులకు ఇచ్చిన మొబిలిటీ ప్లాన్ గడువు ఐదేళ్లు దాటింది. ఈ నేపథ్యంలో మరోసారి ప్లాన్ రూపొందించాలని సెంట్రల్ అర్బన్ ట్రాన్స్పోర్టు విభాగం కోరింది. కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు సీఎంపీ కోసం కన్సల్టెన్సీ సంస్థను ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ టెండర్ల ద్వారా ఎంపిక చేసింది. రెండు నగరాల్లో సమగ్ర మొబిలిటీ ప్లాన్ రూపకల్పన కోసం సిస్ట్ర ఎంవీఏ సంస్థను ఎంపిక చేసింది. విశాఖలో రూ.84.47 లక్షలతో, విజయవాడలో రూ.86.68 లక్షలతో ఈ కంపెనీ మాస్టర్ ప్లాన్ రూపొందించనుంది.
కాగా కాగా, విశాఖ, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. విశాఖలో మొత్తంగా 76.9కిలోమీటర్లు మేరక మూడు కారిడార్లలో మెట్రో రైల్ ప్రాజెక్టుకు ఆమోదం లభించింది.. ఈ ఫేజ్ 1లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాదికి 34.4 కిలోమీటర్లు.. గురుద్వారా నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీసుకు 5.08 కిలో మీటర్లు.. తాడిచెట్ల పాలెం నుంచి చినవాల్తేర్ 6.75 కిలోమీటర్లు నిర్మాణం జరగనుంది. అలాగే కొమ్మాది నుంచి భోగాపురం వరకు 30.67 కిలోమీటర్లు రెండో ఫేజ్లో పూర్తి చేయడానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇక విజయవాడలో 66.15 కిలోమీట్ల నిడివితో మెట్రో రైల్ ప్రాజెక్టు రాబోతోంది. మొదటి ఫేజ్ లో 38.4 కిలోమీటర్లు, రెండవ ఫేజ్ లో 27.75 కిలోమీటర్లు మెట్రో రైలు నిర్మాణం చేపట్టనున్నారు. గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్.. పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి.. పెనమలూరు, పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి అమరావతికి ఇలా మూడు కారిడార్లలో విజయవాడ మెట్రో రైల్ నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.