Semiconductor plant: సెమీకండక్టర్ తయారీ రంగాన్ని నిలబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆమోదించిన నాలుగు యూనిట్ల నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవనున్నట్లు కేంద్ర ఐటి, రవాణా శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఇప్పటికే మంజూరైన ఆరు యూనిట్లకు అన్ని అనుమతులు వేగంగా రావడమే కాకుండా, కొన్ని నెలల్లోనే అవి నిర్మాణ దశకు చేరుకున్నాయని గుర్తు చేశారు.
ఇప్పుడు ఆమోదించిన ప్రాజెక్టుల విషయంలోనూ అదే స్థాయిలో వేగవంతమైన పురోగతి ఆశిస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఒడిశా ముఖ్యమంత్రి ఇప్పటికే తనతో సంప్రదించారని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపినట్లు మంత్రి వెల్లడించారు. కొత్త యూనిట్ల నిర్మాణాన్ని వేగంగా మొదలుపెట్టనున్నామని రాష్ట్రాల ముఖ్యమంత్రులు భరోసా ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.
రూ.4,594 కోట్లతో కొత్త సెమీకండక్టర్ ప్లాంట్లు
దేశవ్యాప్తంగా సెమీకండక్టర్ తయారీకి ఊతమిచ్చేలా కేంద్ర క్యాబినెట్ తాజాగా నాలుగు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పంజాబ్ రాష్ట్రాల్లో ఈ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. మొత్తం వ్యయం సుమారు రూ.4,594 కోట్లు. భారత్లో తయారీ రంగాన్ని దృఢపరిచేందుకు ఇది కీలక అడుగు కానుంది.
ఇతర కీలక ఆమోదాలు కూడా
లఖ్నవూ మెట్రో ప్రాజెక్టు: పట్టణ రవాణా సదుపాయాలను మెరుగుపరిచే లక్ష్యంతో లఖ్నవూ మెట్రో ఫేజ్ 1బి నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు కోసం రూ.5,801 కోట్ల వ్యయం అంచనా వేసింది.
అరుణాచల్ప్రదేశ్లో జలవిద్యుత్ ప్రాజెక్టు: రాష్ట్రంలో 700 మెగావాట్ల సామర్థ్యం గల హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ చర్యలతో దేశంలో పారిశ్రామికీకరణకు నూతన ఊపు రానుందని భావిస్తున్నారు. ముఖ్యంగా సెమీకండక్టర్ రంగంలో భారతదేశం స్వయంపూర్ణత సాధించే దిశగా ఇవి కీలక ముందడుగులు కావచ్చు.


