తిరుమల(Tirumala)లో మరోసారి చిరుత(Leopard) సంచారం కలకలం రేపింది. సోమవారం అర్థరాత్రి ఒంటి గంట సమయంలో అలిపిరి నడకదారిలో గాలిగోపురం సమీపంలోని దుకాణాల వద్ద చిరుత సంచరించింది. ఓ పిల్లిని వేటాడి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. దీంతో దుకాణదారులతో పాటు భక్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
చిరుత సమాచారంపై టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి దుకాణదారులు ఫిర్యాదు చేశారు. అధికారులు ఆ ప్రాంతంలో తనిఖీ చేయగా చిరుత జాడ కనిపించలేదు. ఈ నేపథ్యంలో నడక మార్గంలో భక్తులను అలెర్ట్ చేశారు. మధ్యాహ్నం 2 గంటల వరకే 12 ఏళ్ల లోపు చిన్నారులకు అనుమతి ఇస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత భక్తులు గుంపులు గుంపులుగా వెళ్లాలని సూచించారు. కాగా ఇటీవల కాలంలో చిరుతుల సంచారం నడక మార్గంలో ఎక్కువ కావడం భక్తులను భయాందోళనకు గురిచేస్తోంది.