AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయవాడ ఏసీబీ కోర్టు ప్రాంగణంలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. లిక్కర్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తనను ఈ కేసులో అన్యాయంగా ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను అన్యాయంగా లిక్కర్ కేసులో ఇరికించిన వారిని అస్సలు వదలబోనని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి రిమాండ్ గడువు ముగియడంతో సిట్ అధికారులు ఆయన్ను శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం కోర్టు నుంచి బయటకు వస్తున్న సమయంలో మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ తన ఆవేదనను వెళ్లగక్కారు. “నాకు మద్యం తాగే అలవాటు లేదు, నేను ఎప్పుడూ అమ్మలేదు. తాగుడు వల్లే మా నాన్న,తమ్ముడు చనిపోయారు. అందుకే నేను లిక్కర్ను ద్వేషిస్తా. లిక్కర్ను ద్వేషించే నన్ను లిక్కర్ కేసులో అన్యాయంగా ఇరికించి అరెస్టు చేశారు. కొన్ని పత్రికల్లో నాపై ఇష్టానుసారం అసత్యాలు రాస్తున్నారు. 13 ఏళ్లుగా వేద పాఠశాల నడుపుతున్నా. ఏ తప్పు చేయకుండా నేను శిక్ష అనుభవిస్తున్నా. ఈ కేసులో నా తప్పేమీ లేదు. ” అంటూ మీడియా ఎదుట తన ఆవేదన వెళ్లగక్కారు. తనను ఈ కేసులో ఇరికించిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోనని హెచ్చరిస్తూ పోలీసు జీపు ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఏసీబీ కోర్టుకు హాజరైన 10 మంది నిందితులు..
కాగా, ఏపీ లిక్కర్ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు విధించిన రిమాండ్ గడువు నేటితో ముగియడంతో సిట్ అధికారులు చెవిరెడ్డితో పాటు మొత్తం 10 మందిని కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయరెడ్డి, గోవిందప్ప మినహా మిగతా వారిని శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం నిందితులందరినీ తిరిగి జైళ్లకు తరలించారు. ఏసీబీ కోర్టుకు హాజరైన వారిలో.. విజయవాడ జైలు నుంచి రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్రెడ్డి, చాణక్య, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, వెంకటేష్ నాయుడు, గుంటూరు జైలు నుంచి నిందితులు నవీన్, బాలాజీ కుమార్తో పాటు రాజమండ్రి జైలు నుంచి మిథున్రెడ్డి ఉన్నారు. వీరందరినీ సిట్ అధికారులు శుక్రవారం ఏసీబీ కోర్టుకు తీసుకువచ్చారు. అయితే, బెయిల్పై పైలా దిలీప్, డిఫాల్ట్ బెయిల్పై ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, బాలాజీ గోవిందప్ప బయట ఉన్నారు. వీరు కూడా ఇవాళ (శుక్రవారం) న్యాయస్థానంలో జరిగిన విచారణకు హాజరయ్యారు.
ఫోరెస్సిక్ ల్యాబ్కు నారాయణస్వామి మొబైల్..
మరోవైపు, ఏపీ లిక్కర్ కేసులో శుక్రవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి నారాయణస్వామి మొబైల్ ఫోన్ను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్)కు పంపేందుకు ఏసీబీ కోర్టు అనుమతించింది. దీంతో సిట్ అధికారులు మొబైల్ ఫోన్ను ఎఫ్ఎస్ఎల్కు పంపించారు. వైకాపా హయాంలో నారాయణస్వామి ఎక్సైజ్శాఖ మంత్రిగా పనిచేశారు. మద్యం కేసులో ఇటీవల ఆయన్ను సిట్ అధికారులు ప్రశ్నించారు. అనంతరం నారాయణస్వామి మొబైల్ను స్వాధీనం చేసుకున్నారు.


