Chevireddy Bhaskar Reddy: వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. లిక్కర్ స్కాంలో అభియోగాలు ఎదుర్కొంటున్న ఆయనకు ఊహించని పరిణామం ఎదురైంది. బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి శ్రీలంక రాజధాని కొలంబోకు వెళ్లడానికి సిద్ధమయ్యారు. అయితే ఆయపై లుకౌట్ నోటీసులు అమల్లో ఉండటంతో ఎయిర్ పోర్టు భద్రతా సిబ్బంది చెవిరెడ్డిని అడ్డుకున్నారు. దీంతో ఆయన తిరిగి వెనక్కి వెళ్లిపోయారు.
కాగా గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కాంపై కూటమి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై విచారణ చేపట్టిన అధికారులు ఇప్పటికే పలువురు కీలక నేతలు, అధికారులను అదుపులోకి తీసుకున్న విషయం విధితమే. మాజీ సీఎం జగన్ సన్నిహితులు రాజ్ కసిరెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారులు ధనుంజయ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి పీఏ చరణ్, సజ్జల రామకృష్ణా రెడ్డి బంధువు సజ్జల సుధీర్ రెడ్డి రిమాండ్ లో ఉన్నారు. అలాగే మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి, వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అధికారులు సుదీర్ఘంగా విచారించారు. అయితే మిథున్ రెడ్డి సుప్రీంకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తీసుకోవడంతో ఆయన అరెస్ట్ నుంచి రక్షణ పొందారు. విచారణలో భాగంగా వీరందరి దగ్గరి నుంచి అధికారులు కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి లిక్కర్ స్కాంతో ఉన్న సంబంధాలపై అధికారులు విచారణ చేస్తున్నారు. ఇప్పటికే ఆయన గన్మెన్ ఏఆర్ మదన్ రెడ్డిని విచారించారు. అయితే అనూహ్యంగా మదన్ రెడ్డి సిట్ అధికారులపై సంచలన ఆరోపణలు చేశారు. ఈమేరకు ప్రభుత్వానికి లేఖ రాశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి లిక్కర్ స్కామ్తో సంబంధం ఉందని చెప్పమన్నారంటూ అధికారులు తనపై దాడి చేశారని ఆరోపించాడు. తాము చెప్పినట్టు రాసి.. సంతకం చేయమని తనపై ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. ఇటు గన్ మెన్ సిట్ అధికారులపై ఆరోపణలు చేస్తూ లేఖ రాయడం.. అటు చెవిరెడ్డి కొలంబో వెళ్లేందుకు బెంగళూరు ఎయిర్ పోర్టుకు వెళ్లడం చర్చగా మారింది. అయితే లుకౌట్ నోటీసులు నేపథ్యంలో ఆయనను విమానాశ్రయం భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. మరి లిక్కర్ స్కాం ఎన్ని మలుపులు తిరుగుతుందో.. ఇంకెంతమంది కీలక నేతలు అరెస్ట్ అవుతారో వేచి చూడాలి.
Chevireddy Bhaskar Reddy: చెవిరెడ్డికి షాక్.. బెంగళూరు ఎయిర్ పోర్టులో అడ్డగింత
సంబంధిత వార్తలు | RELATED ARTICLES