Clarity on Rajya Sabha seats in AP: ఆంధ్రప్రదేశ్లో త్వరలో ఖాళీ కానున్న రాజ్యసభ సీట్ల కేటాయింపుపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. నేడు ( జూన్ 4)న జరిగిన సమావేశంలో కూటమి నేతల మధ్య ఈ విషయంలో సయోధ్య కుదిరింది. టీడీపీకి 3, జనసేనకు ఒక స్థానం కేటాయించాలని సమావేశంలో నిర్ణయించారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఎం క్యాంపు ఆఫీసులో జరిగిన ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్, ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పాల్గొన్నారు. సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ భేటీలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన, ఎస్ఐఆర్, రాజ్యసభ స్థానాలపై చర్చించారు. రాజ్యసభ అభ్యర్థుల పేర్లను త్వరలోనే ప్రకటించే ఛాన్స్ ఉంది. వైసీపీ హయాంలో రాజ్యసభకు ఎన్నికైన పిల్లి సుభాష్ చంద్రబోస్, అయోధ్యరామిరెడ్డి, పరిమళ నత్వానీతో పాటు ఎన్డీయే అధికారంలోకి వచ్చాక రాజ్యసభకు వెళ్లిన సానా సతీష్ పదవీకాలం త్వరలో ముగియనుంది. శాసనసభలో మెజారిటీ స్థానాలు ఉన్న క్రమంలో ఈ నాలుగు స్థానాలు కూటమికే దక్కనున్నాయి. ఈ క్రమంలో కూటమిలోని టీడీపీ, జనసేన నాలుగు రాజ్యసభ స్థానాలు పంచుకున్నాయి. అయితే, బీజేపీకి మాత్రం రాజ్యసభ సీటు ఆఫర్ చేయకపోవడం గమనార్హం.
Also read: AP government: ఇకపై వారు కూడా డొనేట్ చేయొచ్చు.. కిడ్నీ రోగుల పట్ల ఏపీ సర్కారు కీలక నిర్ణయం
రాజ్యసభకు వెళ్లే అభ్యర్థులు వీరేనా?
గతంలో వైసీపీ తరఫున రాజ్యసభ సభ్యులుగా వెళ్లిన ఆర్.కృష్ణయ్య, బీద మస్తాన్రావు, విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ కూటమి అధికారంలోకి వచ్చాక తమ పదవులకు రాజీనామా చేశారు. ఆ నాలుగు స్థానాల్లో రెండు భాజపాకి కేటాయించి, టీడీపీ రెండు స్థానాలు తీసుకుంది. ఆర్.కృష్ణయ్య భాజపా నుంచి రాజ్యసభకు వెళ్లారు. విజయసాయిరెడ్డి ఖాళీ చేసిన స్థానంలో భాజపా నాయకుడు పాకా సత్యనారాయణను ఎంపిక చేశారు. బీద మస్తాన్రావు టీడీపీలో చేరగా, ఆ స్థానాన్ని మళ్లీ ఆయనకే కేటాయించారు. మోపిదేవి వెంకటరమణ స్థానంలో సానా సతీష్ రాజ్యసభకు ఎంపికయ్యారు. అయితే, కొత్తగా రాజ్యసభకు వెళ్లనున్న టీడీపీ, జనసేన నేతలు ఎవరనే దానిపై సస్పెన్స్ నెలకొంది.

