Friday, June 13, 2025
Homeఆంధ్రప్రదేశ్CM Chandrababu: ఏడాది పాలనపై సీఎం చంద్రబాబు ఆసక్తికర ట్వీట్

CM Chandrababu: ఏడాది పాలనపై సీఎం చంద్రబాబు ఆసక్తికర ట్వీట్

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటితో ఏడాది పూర్తి అయింది. ఈ సందర్భంగా “సుపరిపాలన… తొలి అడుగు” పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సభ ఇవాళ సాయంత్రం 5 గంటలకు విజయవాడ సమీపంలోని పోరంకిలో జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఇదిలా ఉంటే ఏడాది పాలనపై సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

“సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనలతో కూడిన రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రజల ఆశీర్వాదంతో ఏర్పాటైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజా పాలనలో ఏడాది పూర్తి చేసుకుంది. ప్రజల ఆకాంక్షలను తీర్చడం కోసం శక్తి వంచన లేకుండా ప్రతి రోజూ పని చేస్తున్నాం. అనేక సమస్యలను, ఆర్థిక సవాళ్లను దాటుకుని ఏడాది కాలంలోనే ‘పేదల సేవలో’, ‘పెన్షన్లు, ‘అన్న క్యాంటిన్లు’, దీపం-2, ‘తల్లికి వందనం’, ‘మత్స్యకార సేవలో’…లాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమల్లోకి తెచ్చాం. మెగా డిఎస్సీతో టీచర్ ఉద్యోగాలు…పెట్టుబడులతో ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పనకు అడుగులు వేశాం. 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు సహా రైతు సంక్షేమానికి పలు నిర్ణయాలు తీసుకున్నాం.

ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఆర్థిక సాయం అందిస్తాం. ఇరిగేషన్ ప్రాజెక్టు పనులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే కార్యక్రమం చేపట్టాం. రాజధాని నిర్మాణం, పోలవరం పనులను మళ్లీ గాడిన పెట్టాం. రైల్వే జోన్ సాధించాం. స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించాం. మీ ఆశీర్వాద బలంతో రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా మాట ఇస్తున్నాను. ఏడాది పాలనను విజయవంతం చేయడానికి సహకరించిన, పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. సుపరిపాలనలో తొలి అడుగు ప్రజల్లో నమ్మకాన్ని, భరోసాను కలిగించింది…మలి అడుగు మరింత సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.” అని తెలిపారు.

ఇక మంత్రి నారా లోకేశ్ కూడా ఏడాది పాలనపై ట్వీట్ చేశారు. “ప్రజలు, ప్రజాస్వామ్యం గెలిచి ప్రజా పాలన ప్రారంభమై నేటికి ఏడాది! సుపరిపాలనలో తొలి అడుగు పడింది. విధ్వంసం నుండి వికాసం వైపు ప్రయాణం మొదలైంది. ఇచ్చిన ప్రతి హామీ ఒక పద్ధతి ప్రకారం అమలు చేస్తున్నాం. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా అన్ని ప్రాంతాలను అభివృద్ధి బాట పట్టిస్తున్నాం. గత ప్రభుత్వం ఐదేళ్లలో చెయ్యలేని ఎన్నో పనులు ఏడాదిలోనే పూర్తి చేశాం. అన్ని పనులు ఏడాదిలోనే పూర్తి చేశామని కాలర్ ఎగరేయడం లేదు. చెయ్యాల్సింది ఎంతో ఉంది. నిర్దేశించుకున్న లక్ష్యం కోసం ప్రతినిత్యం శ్రమిస్తాం. ప్రజాసేవలో నిమగ్నమవుతాం. సుపరిపాలనకు సహకరించిన ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగస్తులు అందరికీ ధన్యవాదాలు.” అని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News