CM Chandrababu Delhi Tour: ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడిపారు. మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా , ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లతో ఆయన జరిపిన భేటీలు రాష్ట్ర రాజకీయాల్లోనూ, అభివృద్ధి పథంలోనూ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
అమరావతికి పార్లమెంటరీ చట్టబద్ధత!
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీలో ప్రధానంగా రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుపై చర్చ జరిగింది. బడ్జెట్ రెండో దశ సమావేశాల్లోనే అమరావతికి శాశ్వత రాజధానిగా చట్టబద్ధత కల్పించేలా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని సీఎం కోరారు. దీనివల్ల పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరుగుతుందని, గతంలో జరిగినట్లుగా రాజధాని మార్పు వంటి అనిశ్చితికి తావుండదని చంద్రబాబు వివరించారు.
Also Read:AP Assembly – ఏపీ అసెంబ్లీలో డిజిటల్ హాజరు..
పోలవరానికి రూ. 32 వేల కోట్లు!
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో జరిగిన సమావేశంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులపై సుదీర్ఘ చర్చలు జరిగాయి. పోలవరం రెండో దశ పనులు, భూసేకరణ, పునరావాసం (R&R) కోసం అదనంగా రూ. 32,000 కోట్లు మంజూరు చేయాలని సీఎం కోరారు. ఇటీవల కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన ‘రేర్ ఎర్త్ కారిడార్’, హైస్పీడ్ రైలు కారిడార్ల అమలును వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ముఖ్యమంత్రి వెంట కేంద్ర మంత్రులు కిన్జరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తదితరులు ఉన్నారు. అమరావతి, పోలవరం వంటి ‘రాష్ట్ర జీవనాడుల’ విషయంలో కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

