AP CM Reaction On Ganesh Immersion: గణేష్ నిమజ్జన ఊరేగింపు కార్యక్రమాల్లో జరిగిన ప్రమాదాలపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. పలువురు ప్రాణాలు కోల్పోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి వెంటనే మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్లోని వెస్ట్ గోదావరి జిల్లా తూర్పుతాళ్ళ గ్రామంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఎంతో సంతోషంగా గణేష్ విగ్రహ ఊరేగింపు చేస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. విగ్రహాన్ని తీసుకెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి ఒక్కసారిగా జనాలపైకి దూసుకెళ్లడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురికి గాయలు అయ్యాయి. వెంటనే రంగంలోకి దిగిన అధికారులు గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో తూర్పుతాళ్ళ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
అల్లూరి సీతా రామరాజు జిల్లాలో సైతం ఇద్దరు మృతి..
అల్లూరి సీతా రామరాజు జిల్లా పాడేరు చింతలవీధి జంక్షన్ లో జరిగిన వినాయక నిమజ్జన కార్యక్రమంలో సైతం ఇద్దరు మృతి చెందారు. మరో ఆరుగురు గాయపడినట్లు అధికారులు వివరించారు. వారికి అందుతున్న వైద్య సాయంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. నిర్లక్ష్యంతో ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యల తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
భక్తులు మృతి చెందడం కలచివేసిందన్న మాజీ ముఖ్యమంత్రి..రెండు వేర్వేరు జిల్లాల్లో గణేష్ శోభాయాత్ర విషాదంగా మారడంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదాల్లో భక్తులు మృతి చెందడం తనను కలచివేసిందని అన్నారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. మరణించిన కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.


