CM Chandrababu Switzerland tour attract investments: రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా సీఎం చంద్రబాబు స్విట్జర్లాండ్ పర్యటన కొనసాగుతోంది. స్విట్జర్లాండ్ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయ్యారు. ఈ భేటీ జ్యూరిచ్లో జరిగింది. ఈ సమావేశానికి సీఎంతో పాటు మంత్రి నారా లోకేష్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్విట్జర్లాండ్కు చెందిన ప్రముఖ కంపెనీలు, పెట్టుబడుల సాధనకు ఉన్న అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేలా స్విట్జర్లాండ్ కంపెనీలతో సంప్రదింపులు జరిపేందుకు సహకరించాలని సీఎం.. భారత రాయబారి మృదుల్ కుమార్ని కోరారు. ముఖ్యంగా ఫార్మా, వైద్య పరికరాలు, మిషనరీ తయారీ, హార్డ్వేర్ ఎలక్ట్రానిక్స్, రైల్ కంపోనెంట్స్, టెక్నికల్ టెక్స్టైల్స్, ఆర్ అండ్ డీ కేంద్రాలు వంటి రంగాల్లో సహకారం కావాలని కోరారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక పాలసీలు, రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి తీసుకుంటున్న నిర్ణయాలను రాయబారి మృదుల్ కుమార్కు వివరించారు.
Had a productive meeting in #Zurich with Mridul Kumar, Ambassador of India to Switzerland. We discussed strengthening AP–Switzerland trade ties and encouraging Swiss companies to invest in Andhra Pradesh across technology, manufacturing, electronics, pharma, rail, R&D and… pic.twitter.com/pMzHVOgcvV
— Lokesh Nara (@naralokesh) January 19, 2026
బిజినెస్ టు బిజినెస్ భాగస్వామ్యంతో పెట్టుబడులు..
2025లో సీఎం చంద్రబాబు చేపట్టిన దావోస్ పర్యటన విజయవంతమైందని, దాని ద్వారా రూ. 2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు సమీకరించినట్లు భారత రాయబారి మృదుల్ కుమార్ వెల్లడించారు. అంతేకాకుండా ఎన్నారైల భాగస్వామ్యంతో రాష్ట్రాభివృద్ధికి మరింత దోహదం చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం కోరారు. మరోవైపు, మధ్య యూరప్లోని లిచ్టెన్స్టైన్ దేశంలో జరుగుతున్న ఏఐ పురోగతిపై కూడా మృదుల్ కుమార్ సీఎం బృందానికి వివరించారు. ఈ భేటీ అనంతరం మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ.. స్విట్జర్లాండ్కు చెందిన ఫార్మా కంపెనీలు, యూనివర్సిటీలను ఏపీలో నెలకొల్పేందుకు ముందుకొచ్చాయి. ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేలా సహకరించాలని భారత రాయబారిని కోరాం. వివిధ కంపెనీలతో ఏపీని కనెక్ట్ చేయడంలో రాయబారి మృదుల్ కుమార్ పాత్ర మరువలేనిది. వివిధ రంగాలకు అవసరమైన మ్యాన్ పవర్ సప్లై చేసేందుకు ఏపీ సిద్ధంగా ఉందని, యువతకు నైపుణ్య శిక్షణ కల్పిస్తున్నామని ఆయనకు వివరించాం. అలాగే 100 కేజీల బరువు మోసే డ్రోన్లు తయారు చేసే కంపెనీలు ఏపీలో ఉన్నాయని, వాటిని స్విట్జర్లాండ్ కంపెనీలతో కనెక్ట్ చేస్తామని వివరించాం.” కాగా, బిజినెస్ టు బిజినెస్ (B to B) భాగస్వామ్యంతో పెట్టుబడులను సాకారం చేద్దామని లోకేష్ భారత రాయబారికి పిలుపునిచ్చారు.

