పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా లోక్సభలో బీజేపీ ఎంపీ సీఎం రమేశ్(CM Ramesh), వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి(Mithun Reddy) మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. తొలుత సీఎం రమేశ్ మాట్లాడుతూ.. ఏపీలో 2019-24 మధ్య భారీ లిక్కర్ స్కాం జరిగిందని ఆరోపించారు. రూ.2,500 కోట్ల ఢిల్లీ లిక్కర్ స్కాంతో పోల్చితే ఏపీ లిక్కర్ స్కాం 10 రెట్లు పెద్దది అని తెలిపారు. ప్రైవేటు దుకాణాల స్థానంలో ప్రభుత్వ దుకాణాలు తీసుకొచ్చి అమ్మకాలు జరిపారన్నారు. గత ఐదేళ్లలో రూ. లక్ష కోట్లకు పైగా అమ్మకాలు పూర్తిగా నగదు రూపంలోనే జరిగాయన్నారు. ఉద్యోగులను కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించుకున్నారని వెల్లడించారు.
సీఎం రమేశ్ వ్యాఖ్యలను వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అడ్డుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నుంచి కాంట్రాక్టులు పొందడానికే ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రమేశ్ తీరు చూస్తుంటే ఆయన బీజేపీ ఎంపీగా వ్యవహరిస్తున్నట్టు లేదని… టీడీపీ కోసం పనిచేస్తున్నట్టుందని విమర్శించారు.