Collectors conference: పాలనలో వేగం పెంచడమే లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే నేటి నుండి రెండు రోజులపాటు కలెక్టర్ల సదస్సును నిర్వహించనున్నారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో గురు, శుక్రవారాల్లో నిర్వహించే ఈ అత్యున్నత స్థాయి సమావేశంలో జిల్లాల వారీగా అభివృద్ధి పనులు, ప్రజా సమస్యల పరిష్కారంపై సీఎం సుదీర్ఘ సమీక్ష నిర్వహించనున్నారు.
తొలిరోజు అజెండా: సదస్సు మొదటి రోజున రాష్ట్ర ఆర్థిక స్థితిగతులతో పాటు పరిపాలన పరమైన సంస్కరణలపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. స్వర్ణాంధ్ర కోసం రూపొందించిన పది సూత్రాల అమలుపై సీఎం సమీక్ష చేస్తారు. జిల్లాల వారీగా స్థూల రాష్ట్రీయోత్పత్తి (GSDP) లక్ష్యాలు, వృద్ధి రేటుపై చర్చించనున్నారు. అంతేకాకుండా పాలనలో పారదర్శకత కోసం ఈ-ఆఫీస్ విధానానికి పెద్దపీట వేయనున్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) ద్వారా అందిన దరఖాస్తుల పరిష్కార తీరుపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
రెండో రోజు అజెండా: రెండో రోజున ప్రజల ప్రాథమిక అవసరాలతో పాటు కీలక సంక్షేమ పథకాలపై చర్చ జరగనుంది. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సూపర్ సిక్స్ పథకాల అమలు తీరును పరిశీలిస్తారు. ఎండాకాలం దృష్ట్యా తాగునీటి ఎద్దడి లేకుండా తీసుకున్న ముందస్తు జాగ్రత్తలు, సమ్మర్ ప్లాన్పై కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. రెండు రోజులపాటు సాగే ఈ సదస్సులో మంత్రులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొంటున్నారు.

