నేడు రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియెట్ (Intermediate examinations) ఫస్ట్ ఇయర్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. మెుదటి రోజు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకున్న విద్యార్థుల్లో కాస్త ఆందోళన కనిపించటం సహజమే. అయితే ఇక్కడ మాత్రం విద్యార్థులకు మాత్రం తాము రాసే పరీక్ష సెంటర్ ను ఏకంగా ఉన్న చోట నుంచి మరోక చోటికి మార్చటంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన సత్తెనపల్లి పట్టణంలో జరిగింది.
ఇంటర్ విద్యార్థుల పరీక్షా కేంద్రాలలో అయోమయం చోటుచేసుకుంది. హాల్ టికెట్లో ఉన్న అడ్రస్ ఒకచోట పరీక్ష కేంద్రం మరొకచోట ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. హాల్ టికెట్ లో ఉన్న పరీక్షా కేంద్రానికి వెళ్తే పరీక్ష కేంద్రం వేరే చోటికి మార్చారని బోర్డు దర్శనమిచ్చింది. ఉరుకుల పరుగులతో విద్యార్థులు పరీక్షా కేంద్రానికి పరుగులు తీస్తున్నారు. దీనిపై జిల్లా ఉన్నత అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.
మార్చి 20 వరకు జరిగే ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 1,535 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే ఇందులో 68 కేంద్రాలను సున్నిత, 36 కేంద్రాలను అతి సున్నితమైనవిగా గుర్తించారు. సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలను నిర్వహిస్తున్నారు.
ఇక 10,58,893 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. అందులో మొదటి సంవత్సరం జనరల్ విద్యార్థులు 5,00,963 మంది, ఒకేషనల్ విద్యార్థులు 44,581 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. రెండో సంవత్సరం జనరల్ విద్యార్థులు 4,71,021 మంది, ఒకేషనల్ విద్యార్థులు 42,328 మంది ఉన్నారు.