Devarapalli Hotel Owners Meet YS Jagan : పొగాకు రైతులకు మద్దతుగా, గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న రైతన్నల ఆవేదనను స్వయంగా తెలుసుకునేందుకు వైయస్ జగన్ దేవరపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రానికి పర్యటించారు.ఆ సమయంలో మాజీ ముఖ్యమంత్రిని చూసేందుకు, ఆయనతో మాట్లాడేందుకు వేలాదిగా జనం, రైతులు ఒక్కసారిగా పోటెత్తారు. దాంతో రోడ్డు ఇరుకుగా ఉన్న ప్రాంతంలో విపరీతమైన జనం రద్దీ ఏర్పడి, అనుకోకుండా తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే స్థానిక హోటల్ ప్రాంగణంలో కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది.
వైఎస్సార్సీపీకి ఎలాంటి సంబంధం లేదు: చందన వరలక్ష్మి, దివ్య : హోటల్ నిర్వాహకులు చందన వరలక్ష్మి, చందన దివ్య తాడేపల్లిలో జగన్తో భేటీ అయి స్పష్టమైన వివరణ ఇచ్చారు. తమ హోటల్ వద్ద జరిగిన తోపులాట కేవలం జన సమూహం ఒత్తిడి వల్ల జరిగిందే తప్ప, ఇందులో వైఎస్సార్సీపీ నేతలకు గానీ, కార్యకర్తలకు గానీ ఎలాంటి దురుద్దేశం లేదా సంబంధం లేదని స్పష్టం చేశారు. పొలిటికల్ మైలేజ్ కోసం కొందరు ఈ సంఘటనను ‘దాడి’గా చిత్రీకరించి అభూతకల్పనలు అల్లారని వాపోయారు.
మేము వైఎస్సార్సీపీ కుటుంబమే.. లబ్ధిపొందిన వారమే : రాజకీయ ప్రచారాల్లో నిజం నిలకడమీద తేలిందనడానికి ఈ భేటీయే తార్కాణమని నిర్వాహకులు పేర్కొన్నారు. తమ కుటుంబం మొదటి నుంచీ వైఎస్సార్సీపీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉందాని, గత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అందించిన సంక్షేమ పథకాల వల్ల తమ కుటుంబం ఎంతో లబ్ధి పొందిందని వారు గుర్తుచేసుకున్నారు. తమ వైపే ఉంటూ తమ పార్టీ నేతలపై నిందలు వేయడం సత్యదూరమని, దుష్ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు.
ఓదార్చిన వైయస్ జగన్ : వివరాలు అడిగి తెలుసుకున్న వైయస్ జగన్, హోటల్ నిర్వాహకుల కుటుంబానికి ధైర్యం చెప్పారు. కష్టకాలంలో పార్టీ కార్యకర్తలు & నాయకులు ఎప్పుడూ ప్రజలకు, అభిమానులకు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. ప్రతిపక్ష హోదాలో రైతుల సమస్యలపై పోరాడుతుంటే, నిందలు వేసి దృష్టి మళ్లించే కుట్రలు సహజమని, వాస్తవాలు ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. దీంతో దేవరపల్లి హోటల్ ఉదంతంపై గత కొన్ని రోజులుగా జరుగుతున్న తప్పుడు ప్రచారానికి పూర్తి స్థాయిలో ముగింపు పడినట్లయింది.

