ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్(YS Jagan) రెండో రోజు పులివెందులలో పర్యటించారు. ఇందులో భాగంగా రూ. 10 కోట్లతో ఆధునికీకరణ చేసిన వైయస్ రాజారెడ్డి నేత్రాలయాన్ని పులివెందుల ప్రజలకు అంకితం చేశారు. అనంతరం ఆయన ఆస్పత్రి ప్రాంగణంలో అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. కంటి పరీక్షలు కూడా చేయించుకున్నారు.


పులివెందులలో గత కొన్ని దశాబ్దాలుగా రాజారెడ్డి ఆస్పత్రి సేవలు అందిస్తోంది. దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఈ ఆస్పత్రిలోనే పనిచేసి రూపాయి వైద్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ ఆస్పత్రిని అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దారు. ఈ వైద్యశాలకు వైఎస్సార్ ఫౌండేషన్ స్ధలం సమకూర్చడంతో పాటు సుమారు రూ. 10 కోట్లు వెచ్చించి నూతన భవనం నిర్మించి, అత్యాధునిక కంటి వైద్య సేవలు అందించే ఏర్పాట్లు చేశారు. ప్రముఖ ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్, వైయస్సార్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ ఆస్పత్రిని అధునికీకరించాయి. రోజుకు 5 వేల ఆపరేషన్లు చేయగల అత్యాధునిక పరికరాలను ఆసుపత్రిలో అందుబాటులో ఉంచారు.


ఇక ఈరోజు ప్రత్యేక హెలికాప్టర్లో పులివెందుల నుంచి బెంగళూరుకు జగన్ బయల్దేరి వెళ్లనున్నారు.. మార్చి 3వ తేదీ తర్వాత బెంగళూరు నుంచి తిరిగి తాడేపల్లికి చేరుకోనున్నారు.

