వెల్దుర్తి (తెలుగు ప్రభ): వర్షాకాలం మొదలై రెండు మాసాలు గడిచాయి. చెరువులు జలకళను సంతరించుకుని పొలాలు పచ్చదనాన్ని నింపుకోవాల్సిన చోట.. సరిగా వర్షాలు లేక నేల బీడుబారిపోయి రైతుల కంట కన్నీరు మిగిలింది. దీంతో అన్నదాతలు పొట్టకూటి కోసం వలసల బాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వెల్దుర్తి మండలంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు.. రైతులు, వ్యవసాయ కూలీలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వర్షాలు లేక పంటలు ఎండిపోవడంతో వ్యవసాయ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు ఉపాధి కోసం హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ తదితర పట్టణాలకు వలస బాట పడుతున్నారు.
గ్రామాల్లో ఉపాధి లేక కుటుంబాలను పోషించడం కష్టంగా మారిందని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే ఉపాధి హామీ పనులను విస్తృతంగా చేపట్టి, వలసలను నివారించే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా కరువు పరిస్థితిని అధికారికంగా గుర్తించి రైతులు, కూలీలకు తక్షణ సహాయం అందించాలని వేడుకుంటున్నారు.

