Filling nominated and party posts by this month end: తెలుగుదేశం కార్యకర్తల పార్టీ అని, వారే పార్టీకి అధినేతలని, వారందరికీ న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత నాయకులందరిపై ఉందని ఏపీ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో మంగళవారం రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, జోనల్ కోఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, ఇంఛార్జ్ మంత్రులు, జోనల్ కోఆర్డినేటర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీకి కార్యకర్తే అధినేత అనే టీడీపీ విధానం పక్కాగా అమలు కావాలని, ఆ దిశగా ప్రతీ కార్యకర్తకు పార్టీలో ప్రాధాన్యం ఉండేలా చూడాలని జోనల్ కోఆర్డినేటర్లకు తేల్చి చెప్పారు. అధికారంలో ఉన్నామనే నిర్లక్ష్యం వద్దని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత కసిగా పనిచేశారో, అంతకంటే ఎక్కువ పట్టుదలతో పనిచేసి కార్యకర్తలకు న్యాయం చేయాలని కోరారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి పార్టీ కార్యకర్తలదే కీలక పాత్ర అని గుర్తు చేశారు. ఇంఛార్జ్ మంత్రులతో సమన్వయం చేసుకుంటూ స్థానిక ఎన్నికల వ్యూహరచన చేయాలని జోనల్ కోఆర్డినేటర్లకు ఆదేశాలు ఇచ్చారు. జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట తెలుగుదేశం ఇంఛార్జ్ ల సమన్వయం ఎంతో కీలకం అని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గానికి వెళ్లి పార్టీ వ్యవహారాలపై జోనల్ కోఆర్డినేటర్లు సమీక్షించాలని సూచించారు.
నామినేటెడ్ పదవుల్లో కార్యకర్తలకు పెద్దపీఠ..
ఎమ్మెల్యేలకు, కార్యకర్తలకు సమన్వయం పెంచే బాధ్యత జోనల్ కో ఆర్డినేటర్లదేనని గుర్తు చేశారు. ఎమ్మెల్యేలు తప్పనిసరిగా గ్రీవెన్స్ నిర్వహించి, అర్జీలు తీసుకుని వారి స్థాయిలోనే త్వరితగతిన సమస్యలు పరిష్కారమయ్యేలా చూడాలన్నారు. వైసీపీ ఐదేళ్లలో పెట్టిన అక్రమ కేసులపై సమీక్షించి చట్టపరంగా పరిష్కరిద్దామన్నారు. త్వరలోనే పెండింగ్లో ఉన్న అన్ని పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులు త్వరితగతిన భర్తీ చేస్తామన్నారు. పార్టీకి కష్టకాలంలో అండగా నిలిచిన కార్యకర్తలకు ప్రాధాన్యత ఉంటుందని తేల్చి చెప్పారు. కార్యకర్తల సంక్షేమం కొరకు ఎప్పటికప్పుడు జోనల్ కోఆర్డినేటర్లు స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి నియోజకవర్గాలలో క్లస్టర్, యూనిట్, బూత్, కుటుంబ సాధికార సారథులతో సమావేశం నిర్వహించాలన్నారు. ఎమ్మెల్యేలు, ఇంఛార్జ్లు పెన్షన్ల పంపిణీ, గ్రీవెన్స్, క్యాడర్ మీటింగ్స్, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలలో తప్పని సరిగా పాల్గొనే విధంగా చూడాలన్నారు. వీటన్నింటిపైనా జోనల్ బాధ్యులు ఇచ్చిన నివేదికలు అధిష్టానం సమీక్షిస్తుందని తెలిపారు. ప్రమాద బీమా చెక్కులు తగిన సమయంలోనే బాధిత కుటుంబ సభ్యులకు అందజేయాలని కోరారు. పార్టీ డైరెక్షన్లోనే ప్రతి నాయకుడు పనిచేసే విధంగా చూడాలన్నారు. ఈ సమావేశంలో జోనల్ కోఆర్డినేటర్లు మంతెన సత్యనారాయణ రాజు, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, బీదా రవిచంద్ర యాదవ్, దామచర్ల సత్య, సుజయ్ కృష్ణ రంగారావు, దీపక్ రెడ్డి, వేపాడ చిరంజీవి రావు, కోవెలమూడి రవీంద్ర, పెళ్లకూరు శ్రీనివాస రెడ్డి, మందలపు రవి పాల్గొన్నారు.


