థియేటర్ల బంద్ నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ, ఏపీ ప్రభుత్వం మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖపట్టణంలో పలువురు సినీ ప్రముఖులు(Tollywood) భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దొండపర్తిలో నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు సమావేశమయ్యారు. ఈ భేటీలో నిర్మాతలు స్రవంతి రవికిశోర్, సి.కల్యాణ్, సుధాకర్రెడ్డి, భరత్ భూషణ్, తదితరులు పాల్గొన్నారు. ఈ భేటీ ముగిసిన అనంతరం నిర్మాత సి.కల్యాణ్(C Kalyan) మీడియాతో మాట్లాడారు.
సినిమా టికెట్లు, థియేటర్ల నిర్వహణ, పర్సంటేజీలపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. అలాగే డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాతల సంఘాల్లోని సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయాలనుకుంటున్నామని పేర్కొన్నారు. ఒక్కో సంఘం నుంచి 9 మంది చొప్పున 27మందితో ఈ కమిటీ ఉంటుందన్నారు. కమిటీ సభ్యుల పేర్లు తొలుత ప్రభుత్వానికి తెలియజేస్తామని వివరించారు. ప్రతి నెలా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశం ఉంటుంది అని కల్యాణ్ వెల్లడించారు.