Fire Accident Kakinada: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో భారీ పేలుడు సంభవించింది. ఓ బాణసంచా తయారీ కేంద్రంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్లు సమాచారం. సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెస్తున్నారు.
Also Read: https://teluguprabha.net/crime-news/two-telugu-students-died-in-london-fire-accident/
వేట్లపాలెంలోని ఓ బాణసంచా తయారీ కేంద్రంలో శనివారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం కారణంగా పదుల సంఖ్యలో ప్రాణాలను బలితీసుకుంది. వేట్లపాలెం పరిధి గోదావరి కెనాల్ పక్కనే ఉన్న సూర్య శ్రీ ఫైర్ వర్క్స్ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు వ్యాపించాయి. ఈ ఘటనలో 18 మంది సజీవదహనమైనట్లు తెలుస్తోంది.
Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/ttd-annual-budget-rs-5456-trustees-approved/
భారీ పేలుడు స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పేలుడు శబ్దాలు సుమారు 5కి.మీ వరకు వినిపించాయని స్థానికులు చెబుతున్నారు. శబ్దం తీవ్రతతో గ్రామంలోని ఓ ప్రైవేట్ స్కూల్ గోడకు పగుళ్లు వచ్చాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపులోకి తెస్తున్నారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను అంబులెన్స్లో ఆస్పత్రికి తరలించారు. ప్రమాద కారణాలకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఘటనపై సమాచారం అందుకున్న సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం విజయనగరం పర్యటనలో ఉన్న ఆయన.. పేలుడు ఘటనపై ఆరా తీశారు. తక్షణ సహాయక చర్యలను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో హోం మంత్రి అనిత.. ఘటనాస్థలానికి బయలుదేరారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ, కలెక్టర్ సహా ఇతర ఉన్నతాధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

