Puttaparthi AMCA: పుట్టపర్తిలో అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రాజెక్టు(AMCA)కు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సీఎం చంద్రబాబు శుక్రవారం శంకుస్థాపన చేశారు. రూ.15,803 కోట్ల భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 5వ తరం యుద్ధ విమానాలను తయారు చేయనున్నారు. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, డీఆర్డీవో భాగస్వామ్యంతో 650 ఎకరాల్లో AMCA నిర్మాణం జరగుతోంది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 7,500 మంది నిపుణులకు ప్రత్యక్షంగా ఉపాధి లభించనుందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
‘పుట్టపర్తి అనగానే సత్యసాయిబాబా గుర్తొస్తారు. సత్యసాయి బాబా బోధనలతో విశ్వశాంతికి కృషి చేశారు. ఇకపై పుట్టపర్తి అంటే దేశం గర్వించే రక్షణ కేంద్రంగా తయారవుతుంది. ఇక్కడ ఏఎంసీఏ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం గర్వకారణంగా ఉంది. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో రూ. లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఏఎంసీఏ ప్రాజెక్టుకు సహకరించిన ప్రజలకు అభినందనలు. రాయలసీమను డీ హబ్గా మార్చే దిశలో భాగంగా.. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో డ్రోన్ సిటీ ఏర్పాటు చేస్తున్నాం’- సీఎం చంద్రబాబు
పుట్టపర్తి ప్రపంచంలోనే శాంతికి ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కొనియాడారు. దేశంలో వచ్చే పెట్టుబడుల్లో ఒక్క ఏపీకే 25.3 శాతం వస్తున్నాయంటే డబుల్ ఇంజిన్ సర్కారు వల్లేనని రామ్మోహన్ వెల్లడించారు. ఈ సందర్భంగా రాయలసీమకు ఏఎంసీఏ ప్రాజెక్టు తీసుకొచ్చిన రాజ్నాథ్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రాంతానికి డ్రోన్ ప్రాజెక్టు కూడా రావడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
ఎన్డీఏను గెలిపించినందుకు రుణం తీర్చుకుంటున్నామని మంత్రి లోకేశ్ తెలిపారు. కరవు నేలపై కార్లు తయారీ పరిశ్రమలు తీసుకొచ్చిన మూడు అక్షరాల వ్యక్తి సీబీఎన్ అని కొనియాడారు. ఫైటర్ జెట్లు తయారీ పరిశ్రమలు మన భూమిపైకి తెచ్చిన వ్యక్తి సీబీఎన్ అని చెప్పారు.
ఒకప్పుడు పుట్టపర్తిలో కనీసం వంద ఇళ్లు కూడా లేవని ఇప్పుడు ప్రపంచానికే అద్భుత ఆధ్యాత్మిక కేంద్రంగా పుట్టపర్తి మారిందని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. 1991లో సత్యసాయిబాబా ఎయిర్పోర్టు నిర్మిస్తుంటే చాలామంది ఆశ్చర్యపోయారని గుర్తు చేశారు. ఇప్పుడు సత్యసాయిబాబా విజన్ను చూస్తున్నామని చెప్పారు. ఫైటర్ జెట్ తయారీ సంస్థలను పుట్టపర్తికి ఎన్డీఏ తీసుకొచ్చిందని.. ఎన్డీఏను గెలిపించినందుకు రుణం తీర్చుకుంటున్నామని లోకేశ్ వెల్లడించారు.

