Tuesday, June 24, 2025
Homeఆంధ్రప్రదేశ్Ward Sachivalayam: సచివాలయ ఉద్యోగులకు ఊరట

Ward Sachivalayam: సచివాలయ ఉద్యోగులకు ఊరట

Ward Sachivalayam Employees: ఏపీలోని వార్డు సచివాయల ఉద్యోగులకు ప్రభుత్వ ఊరట కల్పించింది. ఉద్యోగుల బదిలీల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. సొంత మండలానికి బదిలీపై వెళ్లకూడదంటూ ప్రస్తుతం అమలు చేస్తున్న నిబంధనలను సడలించింది. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఇకపై వార్డు సచివాలయ ఉద్యోగులు తమ సొంత మండలానికి బదిలీపై వెళ్లే అవకాశం దొరికింది. అలాగే సొంత వార్డులో కాకుండా ప్రస్తుతం పనిచేస్తున్న పట్టణంలోని ఇతర వార్డులకు లేదా ఉమ్మడి జిల్లా పరిధిలోని ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు బదిలీకి అర్హులని తెలిపింది. ప్రభుత్వం నిర్ణయంపై వార్డు సచివాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అయితే వార్డు సచివాలయ ఉద్యోగులకు వెసులుబాటు కల్పించడంపై గ్రామ సచివాలయ ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమకు కూడా ఇదే తరహాలో అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఒకే శాఖకు చెందిన ఉద్యోగుల విషయంలో రెండు రకాల నిబంధనలు సరికాదని అభిప్రాయపడుతున్నారు. తమకు కూడా సొంత మండలాల్లో పనిచేసే అవకాశం కల్పించాలని కోరుతూ సంబంధిత అధికారులకు వినతి పత్రాలు సమర్పిస్తున్నారు.

కాగా ఇటీవల సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలు ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. 2025, మే 31 నాటికి ఐదేళ్లు సర్వీస్ పూర్తి చేసిన వారిని తప్పనిసరిగా బదిలీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉద్యోగికి స్వస్థలంలో లేదా సొంత మండలంలో కానీ పోస్టింగ్ ఇవ్వకూడని ఆదేశాలు జారీ చేసింది. భార్యాభర్తలు ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఒకే చోట పోస్టింగ్‌లకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. అయితే 5 ఏళ్ల కాలం పూర్తికాని ఉద్యోగులు వ్యక్తిగత అభ్యర్థన మేరకు బదిలీకి అర్హులుగా నిర్ణయించింది. కానీ ప్రభుత్వం నిర్ణయంపై వార్డు సచివాలయ ఉద్యోగుల నుంచి వ్యతిరేకత రావడంతో తాజాగా వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News