AP 10th Exams New Guidelines: ఏపీ పదో తరగతి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ఈ నెల 16 నుంచి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో గతంలో ఉన్న ‘నిమిషం నిబంధన’ను ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
మార్చి 16నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. ఏప్రిల్ 1 వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఈ క్రమంలో పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు సమయానికి చేరుకోవాల్సి ఉంటుంది. అయితే గతంలో ఎగ్జామ్ సెంటర్కి ఒక్క నిమిషం ఆలస్యంగా చేరుకున్నా వారిని పరీక్ష రాయనిచ్చేవారు కాదు. దీంతో చాలా మంది విద్యార్థులు బాధతోనే వెనుదిరిగేవారు. అయితే ఇప్పుడు ఆ నిబంధనను ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. పరీక్ష ప్రారంభమైన తర్వాత కూడా ప్రత్యేక పరిస్థితుల్లో విద్యార్థులను అరగంట వరకు పరీక్షా కేంద్రంలోకి అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గుతుందని అధికారులు పేర్కొన్నారు.
పదోతరగతి పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతాయి. విద్యార్థులను ఉదయం 8:30 గంటల నుంచే కేంద్రంలోకి అనుమతిస్తారు. ఇక విద్యార్థులు పరీక్షా కేంద్రాలను సులభంగా గుర్తించేలా ఈసారి హాల్టికెట్లపై క్యూఆర్ కోడ్ను ముద్రించారు. దీన్ని స్కాన్ చేయడం ద్వారా గూగుల్ మ్యాప్స్ సహాయంతో ఇబ్బందులు లేకుండా సెంటర్కు చేరుకోవచ్చు. మరోవైపు పరీక్షలు రాసే విద్యార్థులు తమ హాల్టికెట్ను చూపిస్తే ఆర్టీసీ బస్సులు.. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీలో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది.

