గుడిబండ ( తెలుగు ప్రభ) : రాయలసీమ ప్రాంతంలో తీవ్రమవుతున్న వర్షాభావ పరిస్థితులు గ్రామీణ ప్రాంతాలను అల్లాడిస్తున్నాయి. వాన దేవుడు కరుణించక, కాలం కలసిరాక దిక్కుతోచని స్థితిలో ఉన్న సమయాన్న, మానవ ప్రయత్నాలకు ఆధ్యాత్మిక శక్తి తోడైంది. శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండల పరిధిలోని మందలపల్లి గ్రామంలో ముస్లిం సోదరులంతా ఒక్కటై ఆ భగవంతుని దయ కోసం సామూహిక ప్రార్థనల బాట పట్టారు.
కరువు ఛాయల్లో పల్లెసీమ: గుడిబండ మండలంలోని మందలపల్లి గ్రామంలో శుక్రవారం ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఖాసీం సాబ్, నభి సాబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రార్థనల్లో గ్రామ ప్రజల సుఖసంతోషాలు, రైతుల పంటలు సమృద్ధిగా పండాలని, వర్షాభావం తొలగిపోవాలని కోరుకున్నారు.వర్షాలు లేక రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగి, పాడిపంటలు సమృద్ధిగా పండాలని ప్రార్థిస్తూ సామూహికంగా నమాజ్ చేశారు.ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు పాల్గొని ఐక్యతను ప్రదర్శించారు.గ్రామంలో వర్షాభావం కారణంగా రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో, ఈ ప్రార్థనలు వారికి ఆధ్యాత్మిక ధైర్యాన్ని కలిగించాయి.

