రిమాండ్లో ఉన్న వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను గుంటూరు పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఆయన రిమాండ్లో ఉన్న నేపథ్యంలో, కోర్టు నుంచి పొందిన అనుమతులతో పోలీసులు ముందస్తుగా జైలు అధికారులకు సమాచారం ఇచ్చారు. అనంతరం ప్రత్యేక వాహనంలో మాధవ్ను గుంటూరుకు తీసుకెళ్లారు. ఎస్కార్ట్ బృందం కూడా భద్రతా చర్యల మధ్య ఆయనతో పాటు ప్రయాణించింది.
టీడీపీ నాయకుడు చేబ్రోలు కిరణ్పై దాడి చేసేందుకు ప్రయత్నించిన కేసులో గోరంట్ల మాధవ్ సహా ఆరుగురు వ్యక్తులు ఈ నెల 10వ తేదీ నుంచి రిమాండ్లో ఉన్నారు. ఈ కేసులో మరింత విచారణ కోసం గుంటూరు పోలీసులు మాధవ్ను రెండు రోజుల కస్టడీకి తీసుకునేందుకు కోర్టు నుంచి అనుమతి పొందారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి తరలించే ముందు మాధవ్తో పాటు ఇతర నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. గుంటూరుకు చేరుకున్న వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో మరోసారి వైద్య పరీక్షలు జరిపారు. అనంతరం నగరంపాలెం పోలీస్ స్టేషన్కు ఆయనను తరలించారు.
కస్టడీ కాలవ్యవధి పూర్తైన తర్వాత, గురువారం సాయంత్రం గోరంట్ల మాధవ్ను గుంటూరు కోర్టులో హాజరుపర్చనున్నారు. అక్కడి నుంచి తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నట్లు సమాచారం.