AP CS Sai Prasad: ఏపీ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా విజయానంద్ పదవీకాలం రేపటితో ముగియనుంది. ఈ క్రమంలో నూతన సీఎస్గా సీనియర్ ఐఏఎస్ అధికారి జి. సాయిప్రసాద్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేయగా.. ఆయన ప్రస్థానం ఈ కథనంలో..
ఏపీ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి జి. సాయి ప్రసాద్.. శనివారం ఉదయం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత సీఎస్ కె. విజయానంద్ పదవీ కాలం రేపటితో ముగియనుండగా.. కొత్త చీఫ్ సెక్రటరీగా సాయి ప్రసాద్ను నియమిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. 1991 బ్యాచ్ ఏపీ క్యాడర్కు చెందిన ఐఏఎస్ అధికారి జి. సాయిప్రసాద్ ‘ఎంటెక్’ విద్యను అభ్యసించారు. సివిల్ సర్వీసెస్పై ఆసక్తితో ఈ రంగంలోకి వచ్చిన ఆయన.. 1992లో వరంగల్ అసిస్టెంట్ కలెక్టర్గా తన వృత్తి జీవితంలోకి అడుగుపెట్టారు.
1993-95 మధ్య పాడేరు అసిస్టెంట్ కలెక్టర్గా గిరిజన ప్రాంతాల్లో సేవలందించిన జి. సాయి ప్రసాద్.. 1995 నుంచి 1997 వరకు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా పనిచేశారు. 1997-98 మధ్య కాలంలో కడప జాయింట్ కలెక్టర్గా.. 2000 నుంచి 2003 వరకు కర్నూలు జిల్లా కలెక్టర్గా విధులు నిర్వర్తించారు.
Also Read: https://teluguprabha.net/telangana/ex-mlc-kavitha-comments-on-ktr-regarding-delhi-liquor-scam-case/
సివిల్ సర్వీసెస్లో భాగంగా సాయి ప్రసాద్ తన వృత్తి జీవితంలో విద్యుత్ రంగం, గృహనిర్మాణ రంగాల్లోనూ తన మార్కును చూపించారు. ఏపీ ట్రాన్స్కో జాయింట్ ఎండీ, ఈపీడీసీఎల్ సీఎండీ, ఏపీ సీపీడీసీఎల్ సీఎండీ, ఏపీ హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్గా విద్యుత్ రంగంలో ఎనలేని కృషి చేశారు. 2011- 2014 వరకు కేంద్ర ప్రభుత్వ ఇంధన శాఖలో సంయుక్త కార్యదర్శిగా.. 2014- 2019 వరకు సీఎంఓ కార్యదర్శిగా, ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. అనంతరం సోలార్ పవర్ కార్పొరేషన్ సీఎండీగా, ఇంధన శాఖ ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. 2024 నుంచి జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు.

