ఏపీ ఇంటర్ బోర్డు ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు(Inter Exams) షెడ్యూల్ విడుదల చేసింది. మే 22 నుంచి 29వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించేందుకు ఏప్రిల్ 30 తుది గడువు అని పేర్కొన్నారు. అలాగే జూన్ 3 నుంచి 6వ తేదీ వరకు రెండు సెషన్లలో ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయన్నారు. జూన్ 9న ప్రథమ ఇంటర్, 10న ద్వితీయ ఇంటర్ విద్యార్థులకు ఇంగ్లిష్ ప్రాక్టికల్ పరీక్షలు ఉంటాయన్నారు.
