Lunar Eclipse : తిరుమల శ్రీవారి భక్తులకు మార్చి నెలలో జరగబోయే ఒక ముఖ్యమైన మార్పు గురించి తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ముందస్తు సమాచారం అందించింది. మార్చి 3వ తేదీన సంభవించబోయే చంద్ర గ్రహణం కారణంగా తిరుమల కొండపై ఉన్న వేంకటేశ్వర స్వామి ఆలయ తలుపులను దాదాపు పదిన్నర గంటల పాటు మూసివేయనున్నారు.
ఖగోళ శాస్త్రం ప్రకారం ఈ చంద్ర గ్రహణం మధ్యాహ్నం 3:20 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6:47 గంటలకు ముగుస్తుంది. అయితే, ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం గ్రహణం పట్టడానికి ఆరు గంటల ముందే ఆలయ ద్వారాలను మూసివేయడం ప్రాచీన కాలం నుంచి వస్తున్న ఆనవాయితీ. ఈ క్రమంలోనే మార్చి 3వ తేదీ ఉదయం 9:00 గంటలకే శ్రీవారి ఆలయ తలుపులను మూసివేసి, గ్రహణ ప్రభావం పూర్తిగా తొలగిపోయిన తర్వాత సాయంత్రం 7:30 గంటలకు తిరిగి తెరుస్తారు.
Medaram : జయజయధ్వానాల నడుమ.. జనజాతరలో సమ్మక్క: గద్దెలపై కొలువుదీరిన వనదేవతలు.. పులకించిన మేడారం!
ఆలయ తలుపులు తెరిచిన వెంటనే భక్తులను నేరుగా దర్శనానికి అనుమతించరు. గ్రహణ సమయంలో ఏర్పడే అశౌచాన్ని తొలగించేందుకు ఆలయ అర్చకులు అత్యంత నిష్టతో ఆలయ శుద్ధి , పుణ్యహవచనం వంటి సంప్రదాయ క్రతువులను నిర్వహిస్తారు. స్వామివారి గర్భాలయంతో పాటు ఆలయ ప్రాంగణమంతా సంప్రోక్షణ చేసిన అనంతరం, రాత్రి 8:30 గంటల నుంచి భక్తులను సర్వదర్శనం కోసం క్యూ లైన్లలోకి అనుమతించడం జరుగుతుంది.
ఈ సుదీర్ఘ విరామం కారణంగా ఆ రోజున ఆలయంలో జరగాల్సిన నిత్య కైంకర్యాలు, వివిధ రకాల ఆర్జిత సేవలను టిటిడి రద్దు చేసింది. అలాగే అన్నప్రసాద వితరణ సమయాల్లో కూడా మార్పులు ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.
దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఈ గ్రహణ సమయాలను , ఆలయ మూసివేత వేళలను దృష్టిలో ఉంచుకుని తమ తిరుమల యాత్రను ప్లాన్ చేసుకోవాలని టిటిడి విజ్ఞప్తి చేసింది. ముఖ్యంగా ఉదయం 9:00 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు భక్తులకు దర్శనం ఉండదు కాబట్టి, ఆ సమయంలో క్యూ లైన్లలో వేచి ఉండే భక్తులు ఓపికతో సహకరించాలని కోరారు.
గ్రహణం వీడిన తర్వాత రద్దీ ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉన్నందున, సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా అదనపు సిబ్బందిని , భద్రతా ఏర్పాట్లను కూడా టిటిడి పర్యవేక్షిస్తోంది. స్వామివారిని దర్శించుకోవాలనుకునే భక్తులు ఈ సమాచారాన్ని గమనించి, తదనుగుణంగా తమ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవడం మంచిది.
NCP Reunion : పవార్ల కలయిక.. పొలిటికల్ మలుపు! విలీనం దిశగా ‘పవర్’ ఫుల్ రోడ్ మ్యాప్

