Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్IVF for cow: ఐవిఎఫ్ టెక్నాలజీతో మేలుజాతి ఆవుల సంతతి

IVF for cow: ఐవిఎఫ్ టెక్నాలజీతో మేలుజాతి ఆవుల సంతతి

కృత్రిమ పద్ధతిలో మేలుజాతి ఆవుల సంతతి

రాష్ట్రంలో ఐవిఎఫ్ సాంకేతిక విధానంలో మేలుజాతి ఆవుల సంతతిని తద్వారా పాలు ఉత్పత్తిని మరింత పెంపొందించే లక్ష్యంతో రాష్టీయ గోకుల్ మిషన్ (RGM) పధకం కింద 73 కోట్ల రూపాయల అంచనాతో కూడిన ప్రతిపాదనలను కేంద్రానికి పంపినట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి వెల్లడించారు. విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో ఆయన పశుసంవర్థక శాఖ అధికారులు, శ్రీవెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం అధికారులతో పాల వెల్లువ తదితర కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు.ముఖ్యంగా రాష్ట్రంలో మేలు జాతి ఆవుల సంతతిని మరింత వృద్ది చేసి తద్వారా పాలు దిగుబడులను పెంపొందించే విధంగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

- Advertisement -

అధిక పాల ఉత్పత్తిని చేసే సాహివాల్,ముర్రా,గిర్ తదితర మేలు జాతి ఆవుల పిండాలను సేకరించి ఐవిఎఫ్ టెక్నాలజీతో కృత్రిమ విధానంలో రాష్ట్రంలో మేలు జాతి ఆవుల సంతతిని మరింత వృద్ది చేసేందుకు కృషి చేయనున్నట్టు తెలిపారు. ఇందుకుగాను రాష్ట్రీయ గోకుల్ మిషన్ కింద 73 కోట్ల రూ.ల అంచనాతో కూడిన ప్రాజెక్టు నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించామన్నారు. ఈ ప్రాజెక్టు మంజురైతే రాష్ట్రంలోని తిరుపతి, గుంటూరులోని లాం ఫారమ్, నెల్లూరు జిల్లాలోని చింతలదీవి ఫారమ్ లలో కృత్రిమ గర్భధారణ విధానంలో మేలుజాతి ఆవుల సంపద వృద్ధికి చర్యలు తీసుకోనున్నట్టు పేర్కొన్నారు.

ఈ విధానంపై పాడి రైతులకు తగిన అవగాహన కల్పించి వారిని అన్ని విధాలా ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి పశుసంవర్థక శాఖ అధికారులను ఆదేశించారు. అనంతరం రాష్ట్రంలో మేలుజాతి గేదెల సంపద వృద్ధి, జగనన్న పాలవెల్లువ పధకం, పశుసంవర్థక శాఖకు సంబంధించిన ఇతర పథకాలు, కార్యక్రమాలపై సిఎస్.జవహర్ రెడ్డి అధికారులతో సమీక్షించారు.

ఈసమావేశానికి వీడియో లింక్ ద్వారా రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది,ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ పాల్గొన్నారు. సమావేశంలో శ్రీవెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం ఉప కులపతి వి.పద్మనాభ రెడ్డి,ఆ విశ్వవిద్యాలయం డీన్ కె.వీరబ్రహ్మయ్య, పశుసంవర్థక శాఖ విస్తరణ సంచాలకులు డా.వెంకట నాయుడు,ఆప్కాబ్ యండి డా.శ్రీనాధ్ రెడ్డి, శ్రీనిధి యండి నాంచారయ్య,ఇంకా పశుసంవర్థక శాఖ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News