Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్జగన్‌ 8వ రోజు 'మేమంతా సిద్ధం' బస్సు యాత్ర సూపర్ హిట్

జగన్‌ 8వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర సూపర్ హిట్

ఇసుకేస్తే రాలని జనసంద్రం

తన ప్రచార సభలకు అద్భుత స్పందన వస్తుండటంతో రెట్టించిన ఉత్సాహంతో జగన్ బస్సు యాత్ర హుషారుగా ఆంధ్రప్రదేశ్ అంతటా సాగుతోంది. ఈ సందర్భంగా జగన్ ప్రసంగం ఆయన మాటల్లోనే..

- Advertisement -

మన తిరుపతిలో నాయుడుపేటలో ఈరోజు ఓ మహా జనప్రభంజనం ఇవాళ ఇక్కడ కనిపిస్తోంది. ఇలా కన్నులెత్తి చూస్తే ఇసుక వేసినా కూడా రాలనంతగా ఓ జనసముద్రం ఇవాళ ఇక్కడ కనిపిస్తోంది. ప్రభంజనం అనే పదానికి అర్థం చెబుతూ ఇక్కడ జరుగుతున్న ఈ సభ చరిత్రలో ఎప్పుడూ కూడా నిలిచిపోతుంది. మంచిచేసిన మనందరి ప్రభుత్వానికి మద్దతుగా, ఇంటింటికీ జరిగిన మంచిని కొనసాగించాలని కోరుతూ, దానికి అడ్డు తగులుతున్న దుష్ట చతుష్టయాన్ని, వారి కూటమి మీద యుద్ధం ప్రకటించడానికి వచ్చిన నా ఆత్మబంధువులైన నా అక్కచెల్లెమ్మలు, నా అన్నదమ్ములు, నా అవ్వలు, నా తాతలు, సోదరులు, స్నేహితులు మీ అందరికీ కూడా మీ జగన్, మీ బిడ్డ రెండు చేతులూ జోడించి పేరు పేరునా çహృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాడు.

మరో 5 వారాల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం
మరో 5 వారాల్లో జరగనున్న కురుక్షేత్ర మహాసంగ్రామంలో ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను మాత్రమే ఎన్నుకునేందుకు జరుగుతున్న ఎన్నికలు కావు. ఈ ఎన్నికల్లో మన ఓటు ద్వారా మన పేదలు, మన రైతన్నలు, మన పిల్లలు, మన అక్కాచెల్లెమ్మలు, మన అవ్వాతాతలు, మన పేద సామాజికవర్గాలు.. వీరందరి భవిష్యత్తును మనం వేసే ఓటుతో నిర్ణయించే ఎన్నికలు ఇవి.

మన భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలివి
ఈ మాట మరొక్కసారి చెబుతున్నాను. ఈరోజు మనం వేస్తున్న ఓటు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు వేస్తున్న ఓటు మాత్రమే కాదు. మన తలరాతను, మన భవిష్యత్తును మనంతట మనమే రాసుకునేందుకు వేస్తున్న ఓటు అని ప్రతి ఒక్కరూ గుర్తెరగమని చెబుతున్నాను.

రాబోయే 5 ఏళ్లలో మన తలరాతను మార్చనున్న ఓటు
ప్రతి వర్గానికీ మంచి చేసి మనం.. ప్రతి వర్గానికీ మోసం చేసి చంద్రబాబునాయుడు గారి కూటమి.. ఈరోజు ఎన్నికల్లో తలబడుతున్నాం. రాగల 5 ఏళ్లలో మీ కుటుంబంలోని ప్రతి ఒక్కరి భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మరొక్కసారి చెబుతున్నాను. మనం వేసే ఈ ఓటుతో రాబోయే 5 సంవత్సరాల్లో మన కుటుంబానికి సంబంధించిన తలరాతలు, మన ప్రతి ఒక్కరి పేద భవిష్యత్తును నిర్ణయించే ఈ యుద్ధానికి మీరంతా.. సిద్ధమేనా?.. అని అడుగుతున్నాను.

ఈ ఎన్నికలు రెండు భావజాలాల మధ్య సంఘర్షణ
జగన్‌ ను ఓడించాలని వారు.. పేదల్ని గెలిపించాలని, ఇంటింటి అభివృద్ధిని కొనసాగించాలని మనం.. చేయబోతున్న ఈ యుద్ధంలో మరో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకోవడానికి మీరంతా సిద్ధమేనా? అని అడుగుతున్నాను. ఈ ఎన్నికలు రెండు భావజాలాల మధ్య సంఘర్షణగా జరుగుతున్న ఎన్నికలు. ఈ ఎన్నికలు వారి పెత్తందారీ భావజాలానికి, మన పేదల అనుకూల భావజాలానికి జరుగుతున్న యుద్ధం. ఈ ఎన్నికలు గవర్నమెంట్‌ బడిలో ఇంగ్లీషు మీడియం వద్దన్న వారికి, అదే గవర్నమెంట్‌ బడిని నాడునేడుతో మొదలు.. ఇంగ్లీషు మీడియంతో పాటు పిల్లల చేతుల్లో ట్యాబులు పెడుతూ డిజిటల్‌ బోధనతో సీబీఎస్‌ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణంతో గవర్నమెంట్‌ బడుల రూపురేఖలు మారుస్తున్నమనకు మధ్య పోరాటం ఈ ఎన్నికలు.

ఈ ఎన్నికలు పేదలకు ఇళ్ల పట్టాలే ఇవ్వడానికి వీల్లేదని, ఒక వేళ పేదలకు ఇళ్ల పట్టాలిస్తే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుందని నిస్సిగ్గుగా కోర్టుల్లో వాదించిన వారికి, ఏకంగా నా అక్కచెల్లెమ్మలపేరిట 31 లక్షల ఇళ్ల పట్టాలు, ఆ అక్కచెల్లెమ్మలకు, ఆ పేదలకు ఇచ్చిన మనకు మధ్య ఈ యుద్ధం జరుగుతోంది. ఈ ఎన్నికలు.. నామినేటెడ్‌ పోస్టుల్లో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, ఈ పేద సామాజికవర్గాలకు పెద్దపీట వేయడానికి మనసు లేని గత టీడీపీ పాలనకు, ఏకంగా చట్టం చేసి మరీ 50 శాతం పదవులు ప్రతి పదానికీ ముందు నా..నా..నా..నా.. అంటూ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ వారందరినీ గుండెల్లో పెట్టుకుని ఆ సామాజికవర్గాలకే ఏకంగా 50 శాతం పదవులు పైచిలుకు ఇచ్చిన మనందరి ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న యుద్ధం. ఈ కురుక్షేత్ర మహాసంగ్రామం. ఈ ఎన్నికలు గతంలో ఎప్పుడూ జరగనట్టుగా, చూడనట్టుగా ఏకంగా రూ2.70 లక్షల కోట్లు.. అందులో 75 శాతానికి పైగా నేను నా అని పిలుచుకునే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటూ ఆ సామాజికవర్గాలకే డీబీటీగా అంటే నేరుగా మీ బిడ్డ బటన్‌ నొక్కడం, నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్లిపోవడం, ఎక్కడా లంచాలు లేకుండా, వివక్ష లేకుండా అందించిన మనందరి ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న యుద్ధం.. ఈ కురుక్షేత్ర మహాసంగ్రామం.

ఈ ఎన్నికలు అది పెన్షన్‌ అయినా, రేషన్‌ అయినా, కాస్ట్‌ సర్టిఫికెట్, బర్త్‌ సర్టిఫికెట్, ఎరువులైనా, ఇలా ఏ స్కీమైనా కూడా ఏ ప్రభుత్వ పథకమైనా కూడా ఏ పౌర సేవ అయినా కూడా క్యూల్లో నిలబడి, వివక్షకు లోనై, లంచాలు సమర్పించుకుంటేనే పేదలకు అవి అందుతాయని వారి అహంకార భావజాలానికి, ఆ సేవలన్నీ కూడా పేదవాడికి నేరుగా ఇంటి వద్దకే వచ్చి తలుపుతట్టి చిరునవ్వుతో గుడ్‌ మార్నింగ్‌ చెప్పి, డోర్‌ డెలివరీ చేసి వారి ఆత్మగౌరవానికి విలువ ఇస్తున్న మనందరి ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న యుద్ధం.. ఈ కురుక్షేత్ర మహాసంగ్రామం.

ఇంటికొచ్చి పెన్షన్‌ ఇస్తే జీర్ణించుకోలేక..
పెన్షన్‌ సొమ్ము తమ ఇంటికే వచ్చి ఆ అవ్వాతాతల పెన్షన్లు మొన్నటి దాకా చూశాం. యుద్ధం ఎలా జరుగుతోందో మీరే గమనిస్తున్నారు. ఏ స్థాయిలో యుద్ధం జరుగుతోందో మీరే చూస్తున్నారు. పెన్షన్‌ సొమ్మును తమ ఇంటికే వచ్చి ఆ అవ్వాతాతల చేతుల్లో ఆ పెన్షన్‌ పెడుతుంటే చూడలేక, చూసి జీర్ణించుకోలేక ఏకంగా 58 నెలలుగా ప్రతి నెలా 1వ తారీఖున అది ఆదివారమైనా, సెలవుదినమైనా తెల్లవారకమునుపే వాలంటీర్లు నేరుగా ఇంటికి వచ్చి చిక్కటి చిరునవ్వుతో గుడ్‌ మార్నింగ్‌ చెబుతూ ఆ అవ్వాతాతలకు ఒక మంచి మనవడిగా, మనవరాలుగా తోడుగా ఉంటూ పెన్షన్‌ చేతిలో పెడుతుంటే.. గత 58 నెలలుగా జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని, ఎన్నికలు వచ్చేసరికే జీర్ణించుకోలేక అసూయతో ఇదే పెద్దమనిషి చంద్రబాబునాయుడు గారు తనకు సంబంధించిన మనిషి నిమ్మగడ్డ రమేష్‌ చేత, ఎన్నికల కమిషన్‌ కు పిటిషన్‌ వేయించి చంద్రబాబు నాయుడు గారు అడ్డుకున్న ఈ పెత్తందారీ భావజాలానికి, గత 58 నెలలుగా ఏ అవ్వాతాతా అవస్థ పడే పరిస్థితి రానే రాకూడదని, ఆ ప్రతి అవ్వకూ, ప్రతి తాతకూ ఆత్మగౌరవాన్ని నిలుపుతూ ఇంటి వద్దకే వచ్చి చేయి పట్టుకుని నడిపిస్తూ, ఆ అవ్వాతాతలకు తోడుగా ఉంటూ ముఖంలో చిరునవ్వు చూసేందుకు, మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, గతంలో ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు కేవలం రూ.1000 ఇస్తున్న ఆ పెన్షన్‌ ను మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని రూ.3వేలకు పెంచుకుంటూ పోయాం.

నేరుగా చేతికే అందిస్తున్న పేదల అనుకూల భావజాలమైన మన ప్రభుత్వానికి, పేదల వ్యతిరేక ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న యుద్ధం. ఆలోచన చేయమని అడుగుతున్నాను. ఈరోజు ఈ కురుక్షేత్ర మహాసంగ్రామానికి సంబంధించి ఇన్ని విషయాలు చెప్పాను. మీ అందరినీ ఒకటే అడుగుతున్నాను. పేదల భవిష్యత్తు కోసం, పేదలకుఅండగా, తోడుగా నిలబడేందుకు మీరంతా కూడా సిద్ధమేనా? అని అడుగుతున్నాను.

అహంకారంతో పెన్షన్లు ఆపించి.. ప్రెస్మీట్‌లలో చెబుతున్నారు
రాజకీయాలు నిజంగా చెడిపోయాయి. దిగజారిపోయాయి. రాజకీయాలు నిజంగా ఏ స్థాయికి దిగజారిపోయాయి అంటే అవ్వాతాతలకు ఇంటివద్దనే ఇచ్చే పెన్షన్లు తాము చెబితేనే చంద్రబాబు నాయుడు గారు ఆపించారు అని అహంకార ధోరణితో వాళ్ల పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులు.. మొన్ననే చూశా టీవీలో. రాజమండ్రిలో టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు లాంటి వారు ఏకంగా ప్రెస్‌ మీట్లు పెట్టి మరీ చెప్పడం మీరంతా కూడా చూశారు. వీళ్ల అహంకార ధోరణిని ఏరకంగా వారు సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారో మీరంతా కూడా గమనించారు.

బాబును హంతకుడు అందామా?
ఇంతటి దుర్మార్గం చేసినందువల్ల ఇప్పటికే గత కొద్ది రోజులుగానే నిన్న, ఈరోజు, ఈ మధ్య కాలంలోనే ఏకంగా 31 మంది అవ్వాతాతలు పెన్షన్‌ ను అందుకునే పరిస్థితిలో అందుకోలేక, నడవలేక, అవస్థ పడలేక ఏకంగా 31 మంది ప్రాణాలు విడిచిన పరిస్థితులు కేవలం ఈ రెండు రోజుల్లో. 31 మందిని చంపిన ఈ చంద్రబాబు నాయుడు గారిని హంతకుడు అందామా?. లేకపోతే అంతకన్నా దారుణమైన పదం ఏమైనా ఉంటే అది అందామా ? అని ఆలోచన చేయమని కోరుతున్నాను.

మరలా వాలంటీర్‌ వ్యవస్ధ తీసుకొస్తాం
నేను అడుగుతున్నా ఇదే చంద్రబాబు నాయుడును. అయ్యా చంద్రబాబు నాయుడు గారూ.. ఈ రాష్ట్రంలో 66 లక్షల మంది పెన్షన్లు తీసుకుంటున్నారు. అవ్వాతాతలు, వితంతు అక్కచెల్లెమ్మలు, దివ్యాంగులు ఉన్నారు. వీందరికీ కూడా చెబుతున్నాను. కొంచం ఓపిక పట్టండి. జూన్‌ 4వ తారీఖున మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది. నా మొట్ట మొదటి సంతకం మళ్లీ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి ఇంటికీ కూడా మళ్లీ సేవలందించే కార్యక్రమం నా మొట్ట మొదటి సంతకం చేస్తాను అని తెలియజేస్తున్నాను.

జన్మభూమి కమిటీలు – లంచాలు ఇస్తేనే పథకాలు
ఇదే చంద్రబాబును అడుగుతున్నాను. అయ్యా చంద్రబాబూ.. నీ హయాంలో మీరు జన్మభూమి కమిటీలు పెట్టుకున్నారు కదయ్యా. పెన్షన్‌ కావాలన్నా, రేషన్‌ కావాలన్నా, సర్టిఫికెట్‌ కావాలన్నా చివరకు మరుగుదొడ్లు కావాలన్నా కూడా లంచం ఇస్తేగానీ, వివక్ష లేనిదేగానీ ఏ ఒక్క పేదవాడికీ అందలేని పరిస్థితి అప్పట్లో ఉండేది కదయ్యా.. మరి మీరు పెట్టుకున్న జన్మభూమి కమిటీలు ఏ మాదిరిగా పని చేశాయి? ఈరోజు వాలంటీర్‌ వ్యవస్థ అన్నది జగన్‌ ను అభిమానించే ఈ సైన్యం ఎలా పని చేస్తోంది అంటే చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించే కార్యక్రమం జరుగుతోంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.

ఆంధ్రప్రదేశ్‌లో పేదవర్గాల ప్రజలు నా వాళ్లు..
ఇంత మందికి అండగా నిలబడ్డాం, తోడుగా నిలబడ్డాం కాబట్టే ఈరోజు మీ బిడ్డ జగన్‌ కు నా అనే వాళ్లు ఎవరు అని ఎవరైనా అడిగితే మీ బిడ్డ ఏం చెబుతాడో తెలుసా.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలు, అందులో పేద వర్గాల ప్రజలు.. వీరంతా నాకు నావాళ్లు అని గర్వంగా కూడా చెబుతాడు మీ జగన్‌. జగన్‌ కు నా వాళ్లు ఎవరు అంటే ఇంకా ఏం చెబుతాడో తెలుసా ? మీ జగన్‌.. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా నిరుపేద వర్గాలు.. వీళ్లందరూ నా వాళ్లు అని గుండెల నిండా సంతోషంగా చెప్పగలుగుతాడు మీ బిడ్డ, మీ జగన్‌.

జగన్‌కు తోడు పేద అక్కచెల్లెమ్మలే…
మళ్లీ ఎవరైనా జగన్‌ కు నా అనేవాళ్లు ఎవరు అని అడిగితే ఇంకా ఏం చెబుతాడో తెలుసా మీ జగన్‌.. ఇది చంద్రబాబుకు కూడా చెబుతా. తెలుసా చంద్రబాబూ.. తెలుసా ఎల్లో ముఠా.. తెలుసా.. జగన్‌ కు నా అనే వాళ్లు, నా తోబుట్టువులుగా భావించే నా పేద అక్కచెల్లెమ్మలు అని చెప్పి గర్వంగా చెబుతాను. నన్ను మనసారా ఆశీర్వదించే నా పేద అవ్వాతాతలు అని కూడా చెబుతాను. ఇదొక్కటే కాదు.. మీ జగన్‌ ఇంకా ఏం చెబుతాడో తెలుసా?. నన్ను జగన్‌ మామా అని.. ప్రేమగా పిలిచే నా చిన్నారులు అని కూడా గర్వంగా చెబుతాడు మీ జగన్‌. వీళ్లంతా నా వాళ్లు. నాబంధువులు. వీరి భవిష్యత్తు మార్చడం కోసమే ఈ 58 నెలలుగా నా ప్రతి అడుగులోనూ కూడా తపన, తాపత్రయంతో అడుగులు వేశాం అని గర్వంగా చెబుతున్నాను.

14 ఏళ్లలో ఒక్క పథకమైనా చేశావా బాబు
మరి ఇదే సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒక మాట అడుగుతున్నాను. అయ్యా చంద్రబాబూ.. నువ్వు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశావు కదయ్యా.. మూడు సార్లు ముఖ్యమంత్రి అని చెప్పుకుంటావు కదయ్యా.. మరి నీ పేరు చెబితే కనీసం ఒక్కటంటే ఒక్కటైనా నువ్వు చేసిన మంచి గానీ, నువ్వు చేసిన ఒక్కటంటే ఒక్క స్కీముగానీ నీ పేరు చెబితే ఏ ఒక్కరికైనా గుర్తుకు వస్తుందా చంద్రబాబూ అని అడుగుతున్నాను. పైగా చంద్రబాబు పేరు చెబితే ఆ పేదలకు గుర్తుకు వచ్చేది వెన్నుపోట్లు, మోసాలు, అబద్ధాలు, కుట్రలు, కుతంత్రాలు. ఇవీ చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చేవి.

అందుకే జగన్‌ కు నా అనే వాళ్లు రాష్ట్రమంతటా కూడా కోట్ల మంది ఉంటే, చంద్రబాబుకు మాత్రం నా అనేవాళ్లు ఎవరో తెలుసా.. మన రాష్ట్రంలో అయితే ఎవరూ లేరు పక్క రాష్ట్రంలోనే, అందరూ నాన్‌ లోకల్సే. ఆ పక్క రాష్ట్రంలో నా అనేవాళ్లు ఎవరు అంటే ఓ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, వీరందరికీ తోడు ఓ దత్తపుత్రుడు. వీళ్లందరూ కలిసి గ్రామ గ్రామాన ఏర్పాటు చేసుకున్న జన్మభూమి దొంగల ముఠా. వీరంతా కూడా మన రాష్ట్రాన్ని దోచుకోవడం, దోచుకున్నది వీరంతా కూడా పంచుకోవడం. ఇదీ వీళ్లకు తెలిసిన రాజకీయం. కాబట్టే చెబుతున్నాను.. ఇంతటి అన్యాయమైన రాజకీయాల మధ్య ఈ 58 నెలలుగా మనం ఏం చేశామంటే, మనం నిర్మిస్తున్న సమాజం ఎలాంటిది అంటే.. ఏ ఒక్క పిల్లాడు గానీ, ఏ ఒక్క పాపగానీ, తన కులం వల్లగానీ, తన మతం వల్ల గానీ, లేదా తన ఆర్థిక పరిస్థితి వల్ల గానీ మంచి చదువులు చదువుకోవడానికి అడ్డంకులు లేని ఓ సొసైటీని క్రియేట్‌ చేసే కార్యక్రమం కోసం ఈ 58 నెలలుగా మీ బిడ్డ కష్టపడ్డాడు.

ధనికులకు ఒకరకమైన చదువు, పేదలకు ఇంకొక రకమైన చదువు ఉండటానికి వీల్లేదని, ధనుకులకు మాత్రమే అందుబాటులో ఉండే ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్‌ ను పేద పిల్లలకు సైతం తీసుకొచ్చే కార్యక్రమానికి ఈ 58 నెలల కాలంలో మీ బిడ్డ శ్రీకారం చుట్టాడు.

నేను ఈరోజు మీ అందరికీ చెబుతున్నాను. మీ బిడ్డ వేసిన ఈ విత్తనాలు మరో 10–15 సంవత్సరాల్లో ఏ స్థాయి వృక్షాలు అవుతాయంటే.. మన పేదింటిలో పుట్టిన మన పిల్లలు.. ఏ లెవల్లో అనర్గళంగా ఇంగ్లీషులో మాట్లాడతారంటే, పెద్దింటి పిల్లలకు కూడా అసూయ పుట్టే విధంగా వాళ్లు మాట్లాడే పరిస్థితి వస్తుందని కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తున్నాను. ఇంటింటికీ మంచి చేయగలిగాం కాబట్టే, మనకు వారి మాదిరిగా కుట్రలు, పొత్తులు, ఎత్తులు, జిత్తులు.. వీటితో పని లేదు. ఎందుకంటే మనం ఇంటింటికీ మంచి చేయగలిగాం.

ఇదే సందర్భంగా గర్వంగా కూడా చెబుతున్నాను. మీ బిడ్డ మోసం చేయలేదు. మంచి చేశాను కాబట్టే మళ్లీ ఒంటరిగా ఆత్మవిశ్వాసంతో మళ్లీ ప్రజల ముందుకు మీ బిడ్డ ఆశీస్సుల కోసం మళ్లీ వస్తున్నాడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబ్టటే మీ జగన్‌.. ఇలా ఈరోజున స్వచ్ఛమైన మనసుతో మంచి చేశాను అన్న ఆత్మవిశ్వాసంతో మీ ముందుకు మరోసారి వచ్చి ఆశీస్సులు కోరే కార్యక్రమం చేస్తున్నాడు. రాబోయే 2024 ఎన్నికల్లో కూడా మీ బిడ్డ అబద్ధాలు చెప్పడు. మోసాలు చేయడు. చేయలేని వాగ్దానాలను సాధ్యం కాని వాగ్దానాలను మీ బిడ్డ మేనిఫెస్టోలో పెట్టడు. ఒక్కటే గుర్తుంచుకోండి. జగన్‌ కు పేదలపై ఉన్న ప్రేమ ఈ దేశ రాజకీయ చరిత్రలో మరే నాయకుడికీ లేదు, ఉండదు అని మాత్రం కచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అందుకే చెబుతున్నాను. జగన్‌ చేయలేని ఏ స్కీమైనా కూడా చంద్రబాబు కాదు కదా.. ఆయన జేజమ్మ కూడా అమలు చేయలేడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.

చంద్రబాబుది కిచిడీ మేనిఫెస్టో
చంద్రబాబుతో ఆయన చేసే మోసాలతో ఆయన చెప్పే అబద్ధాలతో కిచిడీ మేనిఫెస్టో కింద పోటీ పడాలని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే చంద్రబాబు మనస్తత్వం ఎలాగూ చేసేది లేదు కాబట్టి, ప్రజల్ని ఎలాగూ మోసమే కదా చేసేది కాబట్టి నోటికి ఏదొస్తే అది చెప్పేసేయవచ్చు అన్నది ఆయన ధోరణి. అందుకే మీ బిడ్డ చంద్రబాబు నాయుడుతో, ఆయన అబద్ధాలతో, ఆయన మోసాలతో కిచడీ మేనిఫెస్టోతో పోటీ పడాలని మీ బిడ్డ అనుకోవడం లేదు. నిజాలకు, నిజాయితీకి, నిబద్ధతకు ప్రజలు విలువ ఇస్తారన్న నమ్మకం మీ బిడ్డకు ఉంది.

లీడర్‌ అంటే కార్యకర్త కాలర్‌ ఎగరేసేలా ఉండాలి
బాబు మాదిరిగా నేను మోసపు వాగ్దానాలు చేయను. అబద్ధాలు చెప్పను. నేను అడుగుతున్నా ఒకసారి.. ఇక్కడున్న ప్రతి అక్కచెల్లెమ్మను, అవ్వాతాతను, ప్రతి సోదరుడిని, ప్రతి స్నేహితుడినీ అడుగుతున్నా. మీకు ఎలాంటి నాయకుడు కావాలి అని అడుగుతున్నా. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆ లీడర్‌ అనే వాడు ఎలా ఉండాలి అంటే, తనను ప్రేమించే ప్రతి అభిమానీ, ప్రతి కార్యకర్తా, ప్రతి నాయకుడూ, ప్రతి వాలంటీర్‌ కూడా ప్రతి ఒక్కరూ కూడా కాలర్‌ ఎగరేసి అదిగో మా నాయకుడు.. మనసున్న నాయకుడు, మాట ఇస్తే తప్పేదే లేదు అని చెప్పి విలువలకు, విశ్వసనీయతకు మా నాయకుడు ప్రతీక అని చెప్పి చెప్పే మీ బిడ్డలాంటి నాయకుడు కావాలా, లేక చంద్రబాబు మాదిరిగా ఎన్నికలు వచ్చేసరికే ప్రతి ఒక్కరినీ మోసం చేసేందుకు రంగురంగుల హామీలతో కేజీ బంగారం అంటాడు, బెంజ్‌ కారు అంటాడు, సూపర్‌ సిక్స్‌ అంటాడు, సూపర్‌ సెవెన్‌ అంటాడు, రంగురంగుల హామీలతో మేనిఫెస్టోను తీసుకొచ్చి ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలో పడేసి ప్రజలతో పని లేదు ఎన్నికలు అయిపోయాయి కదా అని మర్చిపోయే ఆ చంద్రబాబు మాదిరి రాజకీయాలు చేస్తే ఆ చంద్రబాబు నాయుడుగారిని నమ్ముకుని, ఆయన పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త అయినా, ఆయనను అభిమానించే వారెవరైనా కూడా గ్రామాల్లోకి వెళ్లి, ఇంటింటికీ వెళ్లి కనీసం ఓటు అడిగే నైతిక హక్కు కూడా వాళ్లకు ఉంటుందా అని నేను అడుగుతున్నాను.

మీ బిడ్డ పేదవాడికి తోడుగా ఉంటాడు
మీ అందరికీ అందుకే చెబుతున్నాను. మీ బిడ్డ అబద్ధం ఆడడు. మీ బిడ్డ మోసం చేయడు. మీ బిడ్డ మాట ఇచ్చాడు అంటే ప్రతి పేదవాడికీ తోడుగా కచ్చితంగా ఉంటాడు. ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలన్నీ కూడా కొనసాగిస్తాం. మరిన్ని అడుగులు వేయగలిగిన ప్రతి చోటా కూడా వేస్తాం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకో మాట కూడా చెబుతున్నాను. మన 5 ఏళ్ల పాలనలో మేనిఫెస్టోలో చెప్పనివి కూడా చాలా చేశాం. భవిష్యత్తులో కూడా వెసులుబాటును బట్టి మేనిఫెస్టోలో చెప్పినా, చెప్పకపోయినా కూడా ప్రతి ఇంటికీ చేయగలిగిన మంచి అంతా కూడా చేస్తాను అని మీ బిడ్డ ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ తెలియజేస్తున్నాను.

ఒక్కసారి ప్లాష్‌ బ్యాక్‌లోకి పోతే…
నేను ఇంత నిజాయితీగా మంచి చేసి మీ ముందు నిలబడ్డాను. మరి చంద్రబాబు పరిస్థితి ఏమిటి, బాబు ఎలాంటివాడు, మరోసారి బాబును నమ్మొచ్చా అని ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్నందరినీ కోరుతున్నాను. అందుకనే ఒక్కసారి ఫ్లాష్‌ బ్యాక్‌ లోకి పోదామా? 2014లో ఇదే చంద్రబాబు కూటమిగా ఏర్పడ్డాడు. ఒక ముగ్గురిని తెచ్చుకున్నాడు. ఆయనతోపాటు 2014లో కూటమిలోకి ఇలా ముగ్గుర్ని తెచ్చుకున్నాడు. అవ్వా ఇటు.. అక్కా ఇటు.. కనిపిస్తోందా? చంద్రబాబు నాయుడుగారు 2014లో ముఖ్యమైన హామీలు అంటూ కూటమిలోకి ముగ్గుర్ని తెచ్చుకుని ఓ దత్తపుత్రడి ఫొటో, ఆయన ఫొటో, మోడీగారి ఫొటో. ఈ ముగ్గురి ఫొటోలు పెట్టుకుని స్వయంగా చంద్రబాబు నాయుడుగారు కింద సంతకం పెట్టాడు . ముఖ్యమైన హామీలంటూ ప్రతి ఇంటికీ పంపించాడు.

బాబు విఫల హామీలు..
ఈ ముఖ్యమైన హామీలను ఇదే చంద్రబాబు నాయుడుగారు టీవీల్లో.. గుర్తుందా.. ఎన్నికలప్పుడు 2014లో టీవీల్లో వచ్చిన, పేపర్లలో వచ్చిన అడ్వటైజ్‌ మెంట్‌ గుర్తున్నాయా? రైతులకు రూ.87,612 కోట్ల రుణ మాఫీ చేశాడా? రెండో ముఖ్యమైన హామీ, పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తామన్నాడు. రూ.14,205 కోట్లు.. ఒక్క రూపాయి అయినా చేశాడా అని అడుగుతున్నాను.

బాబు -మూడో ముఖ్యమైన హామీ..
ఆ బిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు బ్యాంకు అకౌంట్లో డిపాజిట్‌ చేస్తామన్నాడు. 2014 నుంచి ఆడబిడ్డలు మీ ఇంట్లో ఎవరికో ఒకరికి పుట్టారు కదా.. మీకు పుట్టకపోయినా మీ పక్కింట్లో అయినా పుట్టారు కదా.. ఏ ఒక్కరికైనా కూడా రూ.25 వేలు కథ దేవుడెరుగు.. ఒక్క రూపాయి అయినా డిపాజిట్‌ చేశాడా? అని అడుగుతున్నాను.

మరో ముఖ్యమైన హామీ.. సంతకం పెట్టి ఇంటింటికీ పంపించాడు. ఇంటింటికీ ఒక ఉద్యోగం ఇస్తాం, ఉద్యోగం ఇవ్వకపోతే రూ.2 వేల నిరుద్యోగ భృతి. అంటే ప్రతి ఇంటికీ రూ.1.20 లక్షలు.. ఇచ్చాడా అని అడుగుతున్నాను. మరో ముఖ్యమైన హామీ.. అర్హులైన వాళ్లందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇళ్లు. కనీసం ఒక్క సెంటు స్థలమైనా గానీ, ఏ ఒక్కరికైనా ఇచ్చాడా అని అడుగుతున్నాను. ఇవన్నీ ఆయన ముఖ్యమైన హామీలబ్బా ఇవన్నీ.. ఆయనంతట ఆయనే ప్రతి ఇంటికీ పంపించి ఆయన సంతకం పెట్టి ఇవన్నీ కూడా పంపించాడు. ఆయన ఫొటో, దత్తపుత్రుడి ఫొటో, మోడీ గారి ఫొటో, కింద ఆయన సంతకం. ప్రతి ఇంటికీ పంపించాడు.

రూ.10 వేల కోట్లతో బీసీ సబ్‌ ప్లాన్, చేనేత, పవర్‌ లూమ్స్‌ రుణాల మాఫీ. చేశాడా? మహిళల రక్షణకు ఉమెన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేస్తామన్నాడు. చేశాడా? రాష్ట్రాన్ని సింగపూర్‌ మించి అభివద్ధి చేస్తామన్నాడు. చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్‌ సిటీ నిర్మిస్తామన్నాడు. నిర్మించాడా? మన నాయుడుపేటలో ఏమన్నా కనిపిస్తోందా? ఇవన్నీ చంద్రబాబు నాయుడుగారు ఆయన కూటమి ముగ్గురూ కలిసి ఆయన సంతకం పెట్టి ముగ్గురి ఫొటోలూ వేసి ప్రతి ఇంటికీ 2014లో ముఖ్యమైన వాగ్దానాలు అంటూ ప్రతి ఇంటికీ పంపించిన పాంప్లేట్‌. ఇందులో ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా కూడా నెరవేర్చాడా అని అడుగుతున్నాను. పోనీ ప్రత్యేక హోదా ఏమైనా తెచ్చాడా అని అడుగుతున్నాను.

మరి నేను అడిగేది ఒక్కటే. మరి 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమైన హామీలు అంటూ ప్రతి ఇంటికీ పంపించిన ఈ పాంప్లేట్‌ లో చెప్పినవన్నీ కూడా, మేనిఫెస్టోలో పెట్టినవన్నీ కూడా ఏ ఒక్కటీ కూడా చేయని ఈ పెద్దమనుషులు, మళ్లీ వీళ్లు ముగ్గురూ కలిసి, మళ్లీ కూటమిగా ఏర్పడి, ఇదే ముగ్గురు మళ్లీ రోజు రంగురంగుల మేనిఫెస్టోతో ప్రతి ఇంటికీ కేజీ బంగారం ఇస్తామని, ప్రతి ఇంటికీ బెంజ్‌ కారు కొనిస్తామని, సూపర్‌ సిక్స్‌ అని, సూపర్‌ సెవెన్‌ అని మరొక్కసారి ఇదే మాదిరిగా మళ్లీ మోసానికి దిగుతుంటే మీరే చెప్పండి.. ఇలాంటి రాజకీయాలు చేసేవాళ్లు మనకు అవసరమా అని అడుగుతున్నాను.
వారి మోసాలను నుంచి కాపాడుకునేందుకు సిద్ధమేనా?
మరి వారి మోసాల నుంచి మన పేదల భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధానికి మీరంతా కూడా సిద్ధమేనా? అని అడుగుతున్నాను. వారి మోసాల నుంచి మన పేదల భవిష్యత్తును కాపాడుకునే ఈ యుద్ధంలో మీలో ప్రతి ఒక్కరూ కూడా ఒక స్టార్‌ క్యాంపెయినర్‌ గా ప్రతి పేదవాడి ఇంటికీ వెళ్లి, ఆ పేదవాడి ఇంట్లో నుంచి కూడా వాళ్లకు జరిగినవన్నీ చెప్పి, ప్రతి ఇంట్లో నుంచి కూడా ఒక స్టార్‌ క్యాంపెయినర్‌ ను బయటకు తీసి వెళ్లి 100 మందికి ఈ విషయాలన్నీ కూడా చెప్పడానికి, చెప్పించడానికి మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతున్నాను. సిద్ధమే అయితే, జేబులో నుంచి సెల్‌ ఫోన్‌ బయటకు తీయండి. సెల్‌ ఫోన్‌ లో ఉన్న టార్చ్‌ లైట్‌ బటన్‌ ఆన్‌ చేయండి. గట్టిగా చెప్పండి. పేదవాడి భవిష్యత్తు కోసం, పేదవాడికి అండగా ఉండేందుకు మేమంతా కూడా సిద్ధమే అని గట్టిగా చెప్పండి. వారి అబద్ధాల మీద, వారి మోసాలమీద, వారి చీకటి రాతల మీద యుద్ధం ప్రకటించడానికి మేమంతా కూడా సిద్ధమే అని గట్టిగా చెప్పండి. ఇది విశ్వసనీయతకు, విలువలకు ప్రతీకగా మనం ఉంటే ఒకవైపు, మోసాలు, అబద్ధాలు, కుట్రలు మరోవైపున ఉండి యుద్ధం జరుగుతోంది.

ఎన్నికల్లో డబుల్‌ సెంచరీ కొట్టాలి
ఈ యుద్ధంలో మంచి చేసిన మన ప్రభుత్వానికి అండగా ప్రతి ఒక్కరూ నిలబడి, 175కు 175 ఎమ్మెల్యేలు.. నేను మరొక్కసారి చెబుతున్నాను. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నిక కాదు. ఈ ఎన్నికలు మనం వేసే ఈ ఓటుతో రాబోయే 5 సంవత్సరాలు మనం అధికారం ఇస్తాం. ఆ అధికారంతో పాలకులు మన తలరాతలు మారుస్తారు. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు, మొత్తంగా 200కు 200 స్థానాలు పూర్తిగా డబుల్‌ సెంచరీ కొట్టడానికి సిద్ధమేనా అని అడుగుతున్నాను. దేవుడు ఆశీర్వదించాలని, దేవుడు దయతలచాలని, మీ చల్లని దీవెనలతో మళ్లీ రెండు నెలల తిరగక మునుపే మీ బిడ్డ మళ్లీ మీ దగ్గరికి వచ్చి మీ అందరికీ ఇంకా మంచి చేసే పరిస్థితులు, అవకాశం దేవుడు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.

మన అభ్యర్ధులకు ఓటేసి ఆశీర్వదించండి
వెళ్లే ముందు.. ఈ పార్లమెంటులో, ఈ జిల్లాలో మన అభ్యర్థులను ఒక్కసారి మీ అందరికీ పరిచయం చేస్తాను. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు ఈ అభ్యర్థులపై ఉంచాలని సవినయంగా ప్రార్థిస్తున్నాను.

తిరుపతి ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తిని మీ అందరికీ పరిచయం చేస్తున్నాను. నాకు తమ్ముడి లాంటి వాడు, సౌమ్యుడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు గురుమూర్తిపై ఉంచవలసిందిగా సవినయంగా వేడుకుంటున్నాను.


అదేవిధంగా సూళ్లూరుపేట నుంచి సంజీవయ్య అన్నను పరిచయం చేస్తున్నాను. నాకు అన్నలాంటి వాడు, మంచి వాడు, సౌమ్యుడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు సంజీవయ్య అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను. తిరుపతి నుంచి అభినయ్‌ ని పరిచయం చేస్తున్నాను. యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి చేయడానికి అడుగులు ముందుకు వేసేందుకు తాను సిద్ధం అని ముందుకొస్తున్నాడు. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు అభినయ్‌ పై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను.

గూడూరు నుంచి మురళి అన్నను పరిచయం చేస్తున్నాను. మీ అందరికీ ఇదివరకే పరిచయం ఉన్న వ్యక్తి, మంచివాడు, సౌమ్యుడు, మురళి అన్నను కూడా ఆశీర్వదించమని సవినయంగా కోరుతున్నాను.

సత్యవేడు నుంచి రాజేష్‌ ను పరిచయం చేస్తున్నాను. నాకు తమ్ముడు లాంటి వాడు, మంచివాడు, సౌమ్యుడు. మీ చల్లని దీవెనలు రాజేష్‌ పై కూడా ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను. కాళహస్తి నుంచి మధును పరిచయం చేస్తున్నాను. చూడటానికి కాస్త మొరటుగా ఉంటాడు కానీ మనిషి మాత్రం మంచోడు. మనసు మాత్రం వెన్నే. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు మధుపై కూడా ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను.

వెంకటగిరి నుంచి రామ్‌ ను పరిచయం చేస్తున్నాను. నాకు స్నేహితుడు అని కూడా చెప్పాలి. మంచివాడు, సౌమ్యుడు, మీ చల్లని దీవెనలు రామ్‌ పై కూడా ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను.

ఈ పార్లమెంటుకే సంబంధించిన సర్వేపల్లి శాసనసభ్యుడు, మంత్రి, నా సహచరుడు, అన్ని రకాలుగా నాకు దగ్గరివాడు, నా స్నేహితుడు, అంతకన్నా ఎక్కువే అని చెప్పాలి. కష్ట కాలంలో పార్టీ బాధ్యతలు తాను భుజాల మీద వేసుకుని గట్టిగా నిలబడ్డాడు. గట్టిగా తోడుగా ఉన్నాడు. గోవర్ధన్‌ అన్నకు మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు కూడా ఇవ్వవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాను.

మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మన గుర్తు తెలియని వాళ్లు అక్కడో ఇక్కడో ఎవరైనా మిగిలి ఉంటే.. అవ్వా మరీ ముఖ్యంగా నువ్వు.. మన గుర్తు ఫ్యాను. ప్రతి సోదరుడికీ, ప్రతి స్నేహితుడికీ, ప్రతి అక్కకూ ప్రతి చెల్లెమ్మకూ చెబుతున్నాను. ఫ్యాను మీద మీరు వేసే రెండు ఓట్లు రాబోయే 5 సంవత్సరాల్లో ఇవాళ ఉన్న బతుకులకంటే రాబోయే 5 సంవత్సరాలు ఇంకా గొప్పగా, ఇంకా మంచిగా చేస్తాను అని ఈ సందర్భంగా మీ బిడ్డ మాట ఇస్తున్నాడు అని తెలియజేస్తున్నాను.

మన గుర్తు ఫ్యాను
మన గుర్తు ఫ్యాను అని, మీ బిడ్డకు తోడుగా ఉండవలసిందిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.

కాస్తంత చీకటి అయ్యింది కాబట్టి మరొక్కసారి మళ్లీ సెక్యూరిటీ వాళ్లు ర్యాంప్‌ మీద పోవడానికి కొంచం రిస్ట్రిక్షన్స్‌ చెబుతున్నారు. కాబట్టి ఏ ఒక్కరూ దయ ఉంచి మరోలా మరోలా అనుకోవద్దని సవినయంగా మీ బిడ్డ ప్రార్థిస్తున్నాడు. అని సీఎం వైయస్‌.జగన్‌ తన ప్రసంగాన్ని ముగించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News