Ponnuru MLA: రాజధాని అమరావతిపై మాజీ ముఖ్యమంత్రి జవన్ మోహన్ రెడ్డికి కనీస అవగాహన లేదని విమర్శించారు పొన్నూరు ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర. మంగళవారం పెదకాకాని మండలం తక్కెళ్లపాడు గ్రామంలో నిర్వహించిన పర్యటనలో ఆయన సుమారు రూ. 1.06 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. సీసీ రోడ్ల నిర్మాణం: గ్రామంలో రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు రూ. 86.50 లక్షల నిధులతో నిర్మించిన సిమెంట్ కాంక్రీట్ (CC) రోడ్లను ఆయన ప్రారంభించారు.
వైసీపీప్రభుత్వ వైఫల్యాలపై నిప్పులు
అభివృద్ధి పనుల అనంతరం జరిగిన సభలో ధూళిపాళ్ల నరేంద్ర గత వైసీపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. “గత ఐదేళ్ల పాలనలో కేవలం కక్షసాధింపు రాజకీయాలే తప్ప అభివృద్ధి శూన్యం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్న గ్రామాలపై వివక్ష చూపి, అక్కడి పనులను కావాలనే నిలిపివేశారు. ఆ గందరగోళానికి తెరదించుతూ, నేడు కూటమి ప్రభుత్వం ఆగిపోయిన పనులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తోంది” అని స్పష్టం చేశారు.
Also Read:Anantapur SP- అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గన్మెన్ సస్పెన్షన్
రాజధానిపై జగన్ వైఖరిపై విమర్శలు
రాజధాని అమరావతి అంశంపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కనీస అవగాహన లేదని ధూళిపాళ్ల ఎద్దేవా చేశారు. “చరిత్రను గమనిస్తే ప్రపంచంలో గొప్ప నాగరికతలన్నీ నదీ తీరాల్లోనే పుట్టాయి. కానీ జగన్కు ఆ ప్రాథమిక జ్ఞానం కూడా ఉన్నట్లు లేదు. మూడు రాజధానుల పేరిట ఆయన ఆడిన ‘మూడు ముక్కలాట’ రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీసింది. అందుకే ప్రజలు అమరావతికి అనుకూలంగా తీర్పు ఇచ్చారు. అయినప్పటికీ జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి గందరగోళ మాటలు మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు” అని మండిపడ్డారు.
తక్కెళ్లపాడులో జరిగిన ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు భారీ సంఖ్యలో గ్రామస్తులు పాల్గొని ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు. అభివృద్ధిని పరుగులు పెట్టించడంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఈ పర్యటన ద్వారా ఎమ్మెల్యే మరోసారి చాటిచెప్పారు.

