Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Jagan: స్టేట్‌ బ్రిలియన్స్‌ అవార్డ్స్‌ –2023లో ఆకట్టుకున్న జగన్ ప్రసంగం

Jagan: స్టేట్‌ బ్రిలియన్స్‌ అవార్డ్స్‌ –2023లో ఆకట్టుకున్న జగన్ ప్రసంగం

షైనింగ్‌ స్టార్స్‌ – ది ప్యూచర్‌ ఆఫ్‌ ఏపీ

రాష్ట్రంలో కల్లా ప్రభుత్వం గర్వంగా చెప్పుకోదగ్గ బ్రైట్‌ మైండ్స్, షైనింగ్‌ స్టార్స్‌ ది ప్యూచర్‌ ఆప్‌ ఏపీ.. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు మీకు.. మీ తల్లిదండ్రులకు, ఇంత గొప్పగా చదువులు చెప్పిన మీ ఉపాధ్యాయులందరికీ గ్రాండ్‌ వెల్‌కమ్‌ అంటూ సీఎం జగన్ స్టేట్ బ్రిలియన్స్ అవార్డ్స్ 2023 ప్రదానోత్సవంలో ఆసక్తికరమైన ప్రసంగం చేశారు.

- Advertisement -

జగన్ ప్రసంగంలోని వివరాలు

మట్టి నుంచి గట్టిగా పెరిగిన మహావృక్షాలకు– అభినందనలు..
ప్రతి మొహంలో కాంతి కనిపిస్తోంది. ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. ఇది నిజంగా నాకు చాలా నచ్చింది. మట్టి నుంచి గట్టిగా పెరిగిన ఈ మొక్కలు ఈరోజు మహా వృక్షాలై ప్రపంచానికే అభివృద్ధి ఫలాలు అందించాలని కోరుకుంటున్నాను. ఈ రోజు మనమంతా ఏకమై చదువులమ్మ గుడులుగా మారుతున్న గవర్నమెంట్‌ బడుల నుంచి పదోతరగతి, ఇంటర్‌ టాపర్లుగా నిల్చిన ఈ ఆణిముత్యాలకు, ఈ విద్యారత్నాలకు మన భావి ప్రపంచ పౌరులకు నిండుమనస్సుతో గుండెల నిండా ప్రేమతో మీ జగన్‌ మామ హృదయపూర్వక అభినందనలు చెబుతున్నాడు.

మరింత గొప్పగా ప్రభుత్వ బడులు…
మిమ్నల్ని అందరినీ చూస్తుంటే… ప్రభుత్వ బడులను, కాలేజీలను మరింత గొప్పగా మార్చాలన్న కోరిక మరింతగా పెరుగుతుంది. ఏ ఒక్క పేదపిల్లలు కూడా పేదరికం వల్ల చదువులకు దూరం కాకూడదని… మన ప్రభుత్వం గట్టిగా నిర్ణయించింది కాబట్టే.. మీరు వెళ్లే ప్రభుత్వ బడి రూపురేఖలు ఇవాళ మారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మీకు ఇచ్చే మిడ్‌ డే మీల్‌ కూడా జగనన్న గోరుముద్దగా మార్పుచేసి అందించగలుగుతున్నాం. జూన్‌లోనే బడులు తెరిచే రోజునే జగనన్న విద్యాకానుకగా ప్రతి చిట్టితల్లి, బాబుకు వాళ్లకు రావాల్సిన పుస్తకాలు, బట్టలు అన్నీ వాళ్ల చేతుల్లో పెట్టాం. ఈ నాలుగేళ్లలో మీరు చదువుకుంటున్న మీడియం ఇంగ్లిషుకి మారింది. ఈ రోజు మొట్టమొదటిసారిగా ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిషు మీడియం, సీబీఎస్‌ఈ సిలబస్‌ అందుబాటులోకి వచ్చింది.
మీ పాఠ్యపుస్తకాల సిలబస్‌ మారింది. బైలింగువల్స్‌ టెక్ట్స్‌బుక్స్‌ తీసుకొచ్చాం. ట్టమొదటిసారిగా బైజూస్‌ కంటెంట్‌ కూడా ప్రభుత్వ బడులలో మన పిల్లలందరికీ అందుబాటులోకి వచ్చింది. మన చదువుకుంటున్న బడులలో మౌలిక సదుపాయాలు, కరిక్యులమ్‌ అన్నీ మారిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతంలో క్లాస్‌ టీచర్లే సరిగ్గా ఉండని పరిస్థితుల నుంచి సబ్జెక్ట్‌ టీచర్లు మూడోతరగతి నుంచే మన బడులలో అందుబాటులోకి తీసుకొచ్చే గొప్ప కార్యక్రమానికి అడుగులు ముందుకు పడుతున్నాయి. 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్‌రూమ్‌లలో కూడా ఇంటరాక్టివ్‌ ప్లాట్‌ ఫ్యానెల్స్‌తో డిజిటల్‌ బోధనతో ప్రతి విద్యార్ధికి మరింత ఎఫెక్టివ్‌గా చదువు నేర్పించే ప్రయత్నం జరుగుతుంది.

ప్రభుత్వ బడులతో ప్రయివేటు బడులే పోటీపడేలా…
8వతరగతి రాగానే ప్రతి విద్యార్ధికి కంటెంట్‌ లోడెడ్‌ ట్యాబును ఇస్తూ…ప్రభుత్వ బడులలో చదువుతున్న పిల్లలను ప్రోత్సహిస్తున్నాం. మన పేదింటి పిల్లలంతా అంతర్జాతీయంగా ఎదగాలన్న ఉద్దేశ్యంతో ఈ ఏడాది నుంచి మూడోతరగతి నుంచి వారిని టోఫెల్‌ ఎగ్జామ్‌కి ప్రిపేర్‌ చేస్తున్నాం. అంతర్జాతీయ సర్టిఫికేషన్‌ ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నాం.

పిల్లలు వినడం, మాట్లాడ్డం రెండింటిలో ఇంగ్లిషులో ఆంతర్జాతీయస్ధాయిలో పోటీపడే పరిస్థితి రావడం కోసం మన ప్రభుత్వ బడులలో ఈ టోఫెల్‌ ఎగ్జామ్‌ జరుగుతుంది.
ఇలాంటి మార్పులు ప్రభుత్వ బడులలో రాగలుగాతాయా ? ఇది సాధ్యమయ్య పనేనా ? కాదు అన్న పరిస్థితి నుంచి….. ఇవన్నీ మన గవర్నమెంట్‌ బడులే.. ప్రైవేట్‌ బడులకు గవర్నమెంట్‌ బడులతో పోటీ పడక తప్పదు అనే పరిస్థితి తీసుకొచ్చాం. ఈ రోజు మీ మేనమామగా… నా ప్రతి అక్కకూ, ఒక మంచి అన్నగా, తమ్ముడిగా వాళ్ల పిల్లలందరికీ మంచి చదువులు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను.

పేదవాడు చదువు కోసం అప్పులు పాలు కాకూడదని…
మీ జగన్‌ మేన మామ ప్రభుత్వంలో ప్రభుత్వ బడులలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ కనీసం డిగ్రీతో బయటకు రావాలి. ఇప్పుడున్న జీఈఆర్‌ రేషియోలో మార్పులు రావాలి. ప్రతి ఒక్కరూ బడిబాట పట్టాలి. డిగ్రీతో బయటకు రావాలి. ఈ క్రమంలో ఏ పేద పిల్లాడు గానీ, తల్లిదండ్రులు గానీ అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదు. వారి చేతిలో డిగ్రీ సర్టిఫికెట్‌ చేతిలో ఉండాలని అనే తాపత్రయంతో విద్యాదీవెన, వసతి దీవెన కార్యక్రమాలు అమలు చేస్తున్నాం.
డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్, ఇటువంటివన్నింటికీ మొత్తం ఫీజులన్నీ ప్రభుత్వమే భరిస్తూ.. విద్యాదీవెన, వసతి దీవెన కార్యక్రమాలను తీసుకొచ్చింది. దీంతోపాటు విదేశాల్లో కూడా టాప్‌ 50 కాలేజీల్లో 21 ఫ్యాకల్టీల్లో 350 కాలేజీల్లో.. ప్రతి పిల్లాడికీ మీరు సీటు తెచ్చుకోండి.. మీకు మీ జగన్‌ మామ ప్రభుత్వం అండగా ఉంటుంది.ఫీజు ఏకంగా రూ. 1.25 కోట్లు అయినా ఫర్వాలేదు, మీరు భయపడాల్సిన పని లేదు. మీరు సీటు తెచ్చుకొండి. మీకు మీ జగన్‌ మామ ప్రభుత్వం తోడుగా ఉంటుంది. ఈ రోజు రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా ఎక్కడా జరగని విధంగా బడులను ప్రోత్సహిస్తూ అమ్మ ఒడి అనే గొప్ప కార్యక్రమం తీసుకొచ్చాం.

మన పిల్లలు ప్రతి రంగంలో ఎదగాలి.. ఎగరాలి..
మన పిల్లలందరూ కుడా ప్రతి రంగంలోనూ ఎదగాలి. ఎదగడం కూడా కాదు.. ఎగరాలి. ప్రపంచంలో వస్తున్న ఇన్వెన్షన్స్, ఇన్నోవేషన్స్‌.. వీటిని అనుసరించేవారుగా మన వాళ్లు ఉండకూడదు. వీటిలో ప్రతి రంగంలోనూ ప్రపంచానికి లీడర్లుగా మన పిల్లలు ఉండాలనే తపన, తాపత్రయంతో అడుగులు వేస్తున్నాం. ఇది జరగాలంటే క్వాలిటీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రావాలి. అందుకే ఈ నాలుగు సంవత్సరాల్లో క్వాలిటీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ మీద మన ప్రభుత్వం పెట్టిన శ్రద్ధ దేశంలో ఎవరూ పెట్టి ఉండరు.

ఇందులో కూడా రాబోయే రోజుల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో దేవుడి సహకారంతో మన గవర్నమెంట్‌ బడుల్లో ఇంటర్నేషనల్‌ బాకలారియేట్‌ (ఐబీ) సిలబస్‌ కూడా తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇంటర్నేషనల్‌ పరీక్షల మాదిరిగానే మన పరీక్ష పత్రాలు కూడా మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. పరీక్షలు అంటే చదువుకుని, జ్ఞాపకం పెంచుకుని, మెదడులోకి డ్రిల్‌ చేసి రాయడం కాకుండా… అంతర్జాతీయ పరీక్షలు మాదిరిగానే మన పిల్లలకు కూడా పరీక్షలకు వెళ్లేటప్పుడు టెక్ట్స్‌బుక్‌ కూడా తీసుకుని పోయినా ఫర్వాలేదనే విధానంలోకి.. ప్రాక్టికాలిటీకి దగ్గరగా, ప్రశ్నలన్నీ ఎనలిటికల్‌గా రాబోయే రోజుల్లో అంతర్జాతీయ సిలబస్‌మాదిరిగా మన ప్రశ్నా పత్రాలు కూడా మార్పులు చేయాల్సిన అవసరం ఉంది.

పేద విద్యార్ధులే ప్రపంచాన్ని ఏలేలా…
గవర్నమెంట్‌ బడుల్లో చదువుకుంటున్న పేద వర్గాలు రేప్పొద్దున ప్రపంచాన్ని ఏలే పరిస్థితి, ఆ రోజు కూడా త్వరలోనే వస్తుంది. ఆ రోజును కూడా మనం చూస్తాం.
ఆ స్ధాయిలో మార్పులన్నీ జరుగుతాయి. నిరుపేద వర్గాలన్నీ రాష్ట్రాన్ని, దేశాన్నే కాదు ప్రపంచాన్నే శాసించే స్ధాయిలోకి మన పిల్లలు వెళ్తారు. అందుకనే ఇక్కడికి వచ్చిన ప్రతి విద్యార్ధి దగ్గర నుంచి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి పిల్లాడు, పాప కూడా ఈ వయస్సు నుంచే మీ ఆలోచనలలోనే శిఖరాలకు ఎదగాలని, అత్యున్నత శిఖరాలకు ఎదగాలనే తపన మన ప్రతి మనస్సులోనూ ఉండాలనే లక్ష్యంతో అడుగు వేయాలని కోరుతున్నాను. బ్యాలెన్స్‌డు అండ్‌ మెచ్యూర్డ్‌ ఆలోచనతో పాటు ఈ ప్రపంచాన్ని మారుస్తున్న టెక్నాలజీ గురించి, మారుతున్న చదువులు గురించి కూడా మన పిల్లలందరూ తెలుసుకోవాలి. వీటిపై కూడా ఆలోచన చేయాలి. లీడర్‌ షిప్‌ క్వాలిటీస్‌ పెంచే విధంగా మన చదువులు ఉండాలి.

చదువుల్లో మార్పు– పేదల బ్రతుకుల్లో రావాలని..
చదువులు వేగంగా మారుతున్నాయి. టెన్త్, ఇంటర్, ఇంజనీరింగ్, మెడిసిన్‌ లేదా ఏదో ఒక డిగ్రీ తెచ్చుకోవడమే కాకుండా… చదువులు వేగంగా మారుతున్నాయి. ప్రపంచాన్ని శాసించబోయే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, డేటా సైన్సెస్, మెషీన్‌ లెర్నింగ్, ఎల్‌ఎల్‌ఎం, ఛాట్‌ జీపీటీ యుగంలో ఉన్న మన పిల్లలందరూ కూడా మారుతున్న ప్రపంచంలో ఎక్కడ ఉన్నాం ? ఎంతగా ఎదగాలి అన్నది ఆలోచించాలి. కారణం రాబోయే రోజుల్లో చదువు ఈ మాదిరిగా ఉండదు. కాంపిటేషన్‌ కూడా ఈ మాదిరిగా ఉండదు. మనం వేగంగా మారకపోతే ఎక్కడుంటామో తెలియని పరిస్థితుల్లోకి మనం పోతాం. ఆ స్థాయిలో మెషిన్‌ లెర్నింగ్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, ఛాట్‌ జీపీటీ యుగంలో ఎడ్యుకేషన్‌ రంగం ప్తూగా మారబోతోంది. ఈ మార్పును ప్రతి పేద వాడికి తీసుకురావాలి. ప్రతి పేద కుటుంబం ఈ మార్పుల్లో భాగస్వామ్యం కావాలి. అప్పుడే మనం ఈ ప్రపంచాన్ని ఏలగలుగుతామన్నది ప్రతి పిల్లవాడు గుర్తుపెట్టుకోవాలి.

అరక దున్నితేనే వజ్రాలు బయటపడతాయి…
టాప్‌ ర్యాంకులు తెచ్చుకున్నమీరే కాదు.. మీతోపాటు ఏ ర్యాంకూ కూడా తెచ్చుకోలేని వాళ్లు కూడా ఈక్వలీ ఇంపార్టెంట్‌. వాళ్లకి కూడా సంకల్పం గట్టిదైతే రిజల్ట్‌ ఆటోమేటిక్‌గా వస్తుందని గుర్తు పెట్టుకోవాలి. అందరూ గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే..
మాణిక్యాలన్నీ మట్టిలోనే తేలుతాయి. అరక దున్నినప్పుడే వజ్రాలు బయటికి వస్తాయన్నది ప్రతి ఒక్కరూ జ్ఞాపకంలో ఉంచుకోవాలి.
ఈ రోజు కార్పొరేట్‌ బడులు, డబ్బులున్నవారికి మాత్రమే పరిమితమైన ప్రయివేటు బడులు, వీటిలో చదువుకోలేకపోయే అవకాశం పోయిందని ఏ ఒక్క విద్యార్ధి, వారి తల్లిదండ్రులు బాధపడాల్సిన పనిలేదు. కారణం మన గవర్నమెంట్‌ బడుల్లో కార్పొరేట్‌ కాలేజీలకు మించి సదుపాయాలు అందిస్తామని తెలియజేస్తున్నాను.

ప్రభుత్వ బడులకు జీవం– ఆణిముత్యాలకు సత్కారం
అందుకనే ఇవాళ గవర్నమెంట్‌ బడికి జీవం పోస్తూ ఆణిముత్యాలను సత్కరించే కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. ఈ ఆణిముత్యాల కార్యక్రమం ద్వారా గవర్నమెంటు బడులలో చదువుతున్న ఈ పిల్లలను దేశానికి చూపిస్తున్నాం. రేపొద్దున్న ప్రపంచానికి చూపించే రోజు కూడా వస్తుందని చెప్పడానికి ఈ కార్యక్రమం నుంచి శ్రీకారం చుడుతున్నాం.
ఈ రోజు ఏం చేస్తున్నాం.. గత నెలరోజులగా ఏం చేసామన్నది మీకు క్లుప్తంగా తెలియజేస్తాను.
ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలలో చదవుకుని ఈ ఏడాది పదోతరగతి, ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలలో టాప్‌ ర్యాంకులలో నిల్చిన పిల్లలకు రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, ఆయా స్కూల్, కాలేజీలలలోనూ ఇలా 4 స్థాయిల్లో టాప్‌ –3 గా నిల్చిన పిల్లలు మరింతగా చదువుకోవాలని, రాణించాలని మరింత మంది పిల్లలకు స్ఫూర్తిదాయకంగా ఉండాలని కోరుకుంటూ… రాష్ట్రానికి వీళ్లందరినీ పరిచయం చేస్తున్నాం.

పేదపిల్లలకూ, తల్లిదండ్రులకూ, ప్రభుత్వ బడులకు, టీచర్లకు సత్కారమిది.
ఈ 4 స్ధాయిలలో రాష్ట్రం మొత్తం మీద ఈ ఏడాది అణిముత్యాలుగా నిల్చి, మొత్తం 22,768 మంది టెన్త్, ఇంటర్‌ పరీక్షల్లో టాప్‌ ర్యాంకుల్లో నిలిచిన పిల్లలను సత్కరించడం జరుగుతోంది.
ఇది ప్రత్యక్షంగా పేద పిల్లలకు, వారి తల్లిదండ్రులు, పరోక్షంగా గవర్నమెంట్‌ బడికి, గవర్నమెంట్‌ బడుల్లో పాఠాలు చెబుతున్న ఆ టీచర్లకు ఇది సన్మానం.

మరోసారి మీ అందరికీ బెస్ట్‌ విషెస్‌ తెలియజేస్తూ.. ఈరోజు మనం చేస్తున్న ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. ఈ ఏడాది కన్నా రానున్న సంవత్సరంలో క్వాలిటీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌లో ఇంకా గొప్ప మార్పులు చూపిస్తూ మంచి రిజల్ట్‌ తో ముందుకు రావాలని చెప్పి మనసారా కోరుకుంటూ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం.

చివరిగా… నేను సత్కరించే 88 మందిలో ఎస్‌ఎస్‌సీలో కేటగిరిలో బాలురు 18 మంది ఉంటే, బాలికలు 24 మంది ఉన్నారు. ఇంటర్‌లో బాలురు 4 ఉంటే, బాలికలు 22 మంది ఉన్నారు. ఇవి నిజంగా ఆడపిల్లలను బడికి పంపించాలని ప్రతి తల్లి, తండ్రని ప్రోత్సహించే గొప్ప నెంబర్లు అని సీఎం ప్రసంగం ముగించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News